ముంబై, మార్చి 9: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల్లో జోరుగా అమ్మకాలు జరగడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచనుండటం, రూపాయి మరింత ఢీలా పడటం కూడా మదుపరుల్లో సెంటిమెంట్ను నీరుగార్చింది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 60 వేల దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 541.81 పాయింట్లు తగ్గి 59,806.28కి జారుకున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 164.80 పాయింట్లు పడిపోయి 17,586.60 వద్ద ముగిసింది.