ముంబై, ఆగస్టు 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, పవర్, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు లాభాల బాటపట్టాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టపోయినప్పటికీ చిన్న స్థాయి షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకోగలిగాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 79.22 పాయింట్లు పెరిగి 65,075.82 వద్ద ముగియగా, నిఫ్టీ 36.60 పాయింట్లు అందుకొని 19,342.65 వద్ద స్థిరపడింది. గత కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడవుతున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు 4.72 శాతం లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది.
దీంతోపాటు టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్నాలజీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు లాభాల్లో ముగిశాయి. కానీ, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకులు నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఆచితూచి వ్యవహరిస్తామని వ్యాఖ్యలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా కొనసాగుతుండటంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. రంగాలవారీగా చూస్తే కమోడిటీ, రియల్టీ, యుటిలిటీ, మెటల్, పవర్, కన్జ్యూమర్ సూచీలు లాభాల్లో ముగియగా..ఎఫ్ఎంసీజీ, టెలి కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ రంగ సూచీలు నష్టపోయాయి.