ముంబై, నవంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,181.34 పాయింట్లు లేదా 1.95 శాతం పుంజుకుని 61,795.04 వద్ద నిలిచింది. దీంతో నిరుడు అక్టోబర్ 18న నమోదైన సెన్సెక్స్ 52 వారాల గరిష్ఠ స్థాయి రికార్డు 61,765.59ని దాటేసినైట్టెంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 321.5 పాయింట్లు లేదా 1.78 శాతం ఎగబాకి 18,349.7 వద్ద స్థిరపడింది. మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో కదలాడిన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ పరుగులు పెట్టాయి.
మెరిసిన హెచ్డీఎఫ్సీ షేర్లు
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మదుపరులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ షేర్లు 5.84 శాతం వరకు పెరిగాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లూ 4.51 శాతం వరకు పుంజుకున్నాయి. మొత్తంగా ఐటీ, మెటల్, ఫైనాన్షియల్, టెక్నాలజీ షేర్లు లాభాల్లో ఉండగా, బీఎస్ఈ స్మాల్క్యాప్ 0.15 శాతం, మిడ్క్యాప్ 0.33 శాతం ఎగిశాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
గ్లోబల్ మార్కెట్లలోనూ దాదాపు అన్ని ప్రధాన సూచీలు లాభాలను అందుకున్నాయి. వాల్స్ట్రీట్ సూచీలు సుమారు రెండున్నరేండ్ల గరిష్ఠాన్ని తాకగా, డోజోన్స్ 3.7 శాతం, ఎస్అండ్పీ 500 సూచీ 5.54 శాతం, నాస్డాక్ 7.35 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ 7.7 శాతం, జపాన్ 2.98 శాతం, దక్షిణ కొరియా 3.37 శాతం, చైనా 1.69 శాతం లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధానమైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి.
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు
అక్టోబర్లో అంచనాల కంటే తక్కువగా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు నమోదయ్యాయి. వినియోగదారుల ధరల సూచీ 0.4 శాతానికి పరిమితమైంది. దీంతో గడిచిన 8 నెలల్లో తొలిసారి ద్రవ్యోల్బణ వార్షిక వృద్ధిరేటు 8 శాతం దిగువకు చేరింది. దీంతో మదుపరులలో కొత్త ఉత్సాహం తొణికిసలాడింది.
ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు
దేశంలో ద్రవ్యోల్బణం స్థాయి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తమ మున్ముందు ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను పెంచబోదన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇవి భారత్సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు, అన్ని ప్రధాన రంగాలకు కలిసొచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లన్నీ లాభాల్లో పరుగులు పెట్టడం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లను ఉత్సాహపరిచింది. అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లోని ప్రధాన సూచీలు ఆకర్షణీయ లాభాలను అందుకున్నాయి. అన్ని రంగాల షేర్లకు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతు లభించింది.
బలపడిన రూపాయి
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టించింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం ట్రేడింగ్ మొదలైన దగ్గర్నుంచి రూపాయి విలువ పెరుగుతూనేపోయింది. దీంతో స్టాక్స్లో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు అమితాసక్తిని ప్రదర్శించారు.
విదేశీ మదుపరుల పెట్టుబడులు
విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) పెట్టుబడులతో ముందుకు రావడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. నిజానికి గత 2-3 వారాలుగా ఎఫ్ఐఐలు భారతీయ స్టాక్స్ను కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.19,000 కోట్లకుపైగా పెట్టుబడుల్ని తెచ్చినట్టు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు చెప్తున్నాయి.