ముంబై, జూలై 4: వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సరికొత్త స్థాయిలను చేరాయి. సూచీలు ఇప్పటికే ఆల్టైమ్ హైల్లో కదలాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెన్సెక్స్ 65,400, నిఫ్టీ 19,300 మార్కులకు ఎగువన ముగిసి నయా లైఫ్టైమ్ రికార్డులను నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 274 పాయింట్లు లేదా 0.42 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 65,479.05 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 467.92 పాయింట్లు పుంజుకొని 65,672.97 వద్దకు వెళ్లి ఇంట్రా-డే హై రికార్డును సృష్టించింది. నిఫ్టీ సైతం 66.45 పాయింట్లు లేదా 0.34 శాతం ఎగబాకి తొలిసారిగా 19,389 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 111.6 పాయింట్లు పెరిగి మొదటిసారి 19,434.15 స్థాయిని తాకడం గమనార్హం.
5 రోజుల్లో రూ.7.9 లక్షల కోట్లు
గత 5 రోజులుగా లాభాల్లోనే ముగుస్తున్న నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ భారీగా పెరిగింది. రూ.2,98,57,649.38 కోట్లకు చేరింది. గడిచిన 5 రోజుల్లో సెన్సెక్స్ 2,500 పాయింట్లకుపైగా వృద్ధి చెందింది. దీంతో మదుపరుల సంపద కూడా రూ.7,90,235. 84 కోట్లు ఎగబాకడం విశేషం. మార్కెట్లో పెట్టుబడుల ఉత్సాహం ఇలాగే కొనసాగితే త్వరలోనే మార్కెట్ క్యాప్ రూ.300 లక్షల కోట్లకు చేరవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. ఎఫ్పీఐలు మంగళవారం రూ.2,134.33 కోట్ల షేర్లను కొన్నారు.