దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. గత ఏడాది తరహాలోనే మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాటకు లోనవుతుండటంతో కొత్త ఏడాదీ ఆటుపోట్లు తప్పడం లేదు. గత వారం ట్రేడింగ్ ఇందుకు నిదర్శనం. ఆఖర్లో చోటుచేసుకున్న నష్టాలు.. ముందటి లాభాలను మింగేయకపోతే సూచీలు మరింత పై స్థాయిల్లోనే ఉండేవి. ఇక అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 524.04 పాయింట్లు లేదా 0.66 శాతం పెరిగి 79,223.11 వద్ద ఆగింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 191.35 పాయింట్లు లేదా 0.80 శాతం పుంజుకుని 24,004.75 దగ్గర నిలిచింది.
ఈ క్రమంలో ఈ వారం కూడా ట్రేడింగ్లో ఎత్తుపల్లాలకు ఆస్కారముందని మెజారిటీ నిపుణులు చెప్తున్నారు. అయితే బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల షేర్లలో ర్యాలీకి వీలుందనీ అభిప్రాయపడుతున్నారు. కానీ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం.. మార్కెట్ జోష్ను బాగా దెబ్బతీస్తున్నది. భారీగా పడిపోతున్న రూపీ ఎక్సేంజ్ రేట్లు.. ఇప్పటికే ఆల్టైమ్ కనిష్ఠానికి దేశీయ కరెన్సీని పరిమితం చేశాయి మరి. ఫలితంగా మరింత రూపాయి క్షీణత.. స్టాక్ మార్కెట్లను ఇంకా ప్రభావితం చేయవచ్చు. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,600 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,400 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,300-24,500 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.