ముంబై, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61వేల మార్కును అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ 18వేల మార్కును దాటింది. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో మదుపరుల అమ్మకాల ఒత్తిళ్ల మధ్య మార్కెట్లు నష్టాల్లో నడిచినా.. చివరకు మాత్రం లాభాలనే పంచాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 463.06 పాయింట్లు లేదా 0.76 శాతం పుంజుకొని 61,112.44 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 560.08 పాయింట్లు ఎగిసి 61,209.46 స్థాయిని తాకడం విశేషం. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 149.95 పాయింట్లు లేదా 0.84 శాతం ఎగబాకి 18,065 వద్ద నిలిచింది. ఫలితంగా వరుసగా ఐదో రోజూ మార్కెట్లు లాభాలను అందుకున్నైట్టెంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐటీసీ షేర్లు మదుపరులను అమితంగా ఆకట్టుకోవడం, విదేశీ పెట్టుబడులు కొనసాగడం కలిసొచ్చిందని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో..
ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొన్ని లాభాల్లో ముగిస్తే.. మరికొన్ని నష్టాలకు పరిమితమయ్యా యి. విప్రో, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్లు లాభపడ్డాయి. అయితే హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఎల్అండ్టీ షేర్లూ మదుపరులను ఆకట్టుకోగా.. టైటాన్, హెచ్యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నిరాశపర్చాయి. రంగాలవారీగా టెలీకమ్యూనికేషన్ సూచీ అత్యధికంగా 2.44 శాతం లాభపడగా, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, కమోడిటీస్, యుటిలిటిస్, పవర్, టెక్నాలజీ, ఐటీ షేర్లు 1.74 శాతం వరకు పెరిగాయి. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ 1.32 శాతం, స్మాల్ క్యాప్ 0.91 శాతం చొప్పున పుంజుకున్నాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మాత్రం నష్టాల్లో కదలాడాయి. అయితే అమెరికా మార్కెట్లు గురువారం భారీ లాభాలను అందిపుచ్చుకున్నాయి.