ముంబై, జూన్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు మందగించనున్నదని, అలాగే ధరల సూచీ పుంజుకునే అవకాశం ఉన్నదని రిజర్వు బ్యాంక్ అంచనా మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి. వీటికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, విదేశీ మదుపరులు భారీగా పెట్టుబడులను తరలించుకుపోవడం కూడా సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా వెయ్యి పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 116.67 పాయింట్లు నష్టపోయి 74,243.34 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీల్లో 2 వేల షేర్లు నష్టపోగా, 2 వేల షేర్లు లాభాల్లో ముగియడం విశేషం.
మరోవైపు, 50 షేర్ల ఇండెక్స్ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 49.85 పాయింట్లు కోల్పోయి 23,366.70 వద్ద స్థిరపడింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 532.40 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 181 పాయింట్లు పతనం చెందింది. సూచీల్లో ట్రెంట్ షేరు 2.21 శాతం తగ్గి టాప్లూజర్గా నిలిచింది. దీంతోపాటు టీసీఎస్, టాటాస్టీల్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీ, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండిగో, బీఈఎల్, బజాజ్ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, మారుతి షేర్లు నష్టపోయాయి. కానీ, హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, బజాజ్ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఎల్అండ్టీ, పవర్గ్రిడ్, సన్ఫార్మా, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.