Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టపుటేరులు పారుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కఠిన ద్రవ్య వైఖరి దిశగా అడుగులు వేస్తుండటం మదుపరులకు అస్సలు రుచించడం లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 4,091.53 పాయింట్లు లేదా 4.98 శాతం కోల్పోయి 79వేల మార్కుకు దిగువన 78,041.59 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 1,180.80 పాయింట్లు లేదా 4.76 శాతం దిగజారి 24వేల మార్కును చేజార్చుకొని 23,587.50 దగ్గర స్థిరపడింది.
దీంతో ఈ వారం కూడా ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికే లోను కావచ్చన్న అంచనాలున్నాయి. ఫలితంగా ప్రధాన రంగాల్లో లాభాల స్వీకరణకు వీలుందంటున్నారు. ఇక ఈ వారం డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు కూడా ప్రధానమే. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,000 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,900-24.100 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.