Stock Markets | ముంబై, మార్చి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలకు ఎనర్జీ బ్యాంకింగ్ షేర్ల మద్దతుతోపాటు ఈ ఏడాదికిగాను భారత్ అంచనాలకుమించి రాణించనున్నట్లు మూడీస్ వెల్లడించడంతో మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఇరు సూచీలు ఆకాశమే చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో భారత్ 8.4 శాతం వృద్ధిని సాధించిన విషయం తెలిసిందే. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 66.14 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 73,872.29 పాయింట్లకు చేరుకున్నది. ఇంట్రాడేలో సూచీ 183.98 పాయింట్లు ఎగబాకి 74 వేల పాయింట్ల దిశలో పయనించింది. మరో సూచీ నిఫ్టీ 27.20 పాయింట్లు అందుకొని ఆల్టైం హైకి 22,405.60 పాయింట్లకు చేరుకున్నది. ఇంట్రాడేలోనూ 22,440.90 పాయింట్లు అందుకున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, వాహన రంగ షేర్లను విక్రయించిన మదుపరులు..ఇదే సమయంలో బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా రంగ షేర్లను ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి దోహదపడ్డాయి.