న్యూఢిల్లీ, జనవరి 25: దేశంలో తయారీ రంగానికి దన్నుగా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా.. రాబోయే బడ్జెట్లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని, మార్కెటింగ్ కార్యకలాపాల విస్తృతికి వీలుగా మరిన్ని నిధులను కేటాయించాలని ఎగుమతిదారులుసహా భారతీయ పరిశ్రమ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పెరుగుతున్న ఎగుమతులకు అనుగుణంగా పెరిగిపోతున్న రవాణా ఖర్చుల నిమిత్తం విదేశాలకు దేశం నుంచి వెళ్తున్న సొమ్మూ ఎక్కువగానే ఉందని తెలియజేసింది.
ఈ క్రమంలోనే ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యంలో ఓ గ్లోబల్ షిప్పింగ్ లైన్నూ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి ఇండస్ట్రీ వర్గాలు సూచించాయి. దీనివల్ల భారతీయ సంస్థలకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు వ్యయభారం తగ్గుతుందన్నాయి. ‘2021లో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చార్జీగా 80 బిలియన్ డాలర్లకుపైగా మేము చెల్లించుకోవాల్సి వచ్చింది.
2030 నాటికి ఇది 200 బిలియన్ డాలర్లను తాకవచ్చని అంచనా’ అని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ఈ సందర్భంగా పేర్కొన్నది. అలాగే దేశంలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) ప్రగతి కోసం వెయిటెడ్ ట్యాక్స్ డిడక్షన్ 200 శాతానికి పెరగవచ్చన్నది. ‘చైనా, అమెరికా, కొరియా, ఇజ్రాయెల్ దేశాల కంటే ఆర్అండ్డీపై భారత్ పెడుతున్న ఖర్చు చాలా తక్కువ. దేశ జీడీపీలో 1 శాతానికిలోపే ఉన్నది. ఇది నిజంగా దురదృష్టకరం’ అని ఎఫ్ఐఈవో ఉపాధ్యక్షుడు ఇస్రార్ అహ్మద్ అన్నారు.
అంతర్జాతీయ కస్టమర్లకు భారతీయ ఉత్పత్తులు, సేవలు అందేందుకు దూకుడుతో కూడిన ఎగుమతి మార్కెటింగ్ అవసరమని, కాబట్టి మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) స్కీం కింద వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రూ.5,000 కోట్ల కార్పస్తో దేశవ్యాప్తంగా ఓ 50 జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన ఓ పథకాన్ని ప్రకటించేందుకున్న వీలును పరిశీలించవచ్చని కూడా కేంద్రానికి సలహా ఇచ్చారు.
ఇదిలావుంటే ఉత్పాదక ప్రక్రియల్లో పర్యావరణహిత ఇంధనాన్ని వాడేందుకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను కల్పించేందుకున్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని స్టార్టప్ సంస్థ డబ్ల్యువోసీఈ వ్యవస్థాపక డైరెక్టర్ అనుప్ గార్గ్ కోరారు. గ్రీన్ టెక్నాలజీల్లో పెట్టుబడుల కోసం రాయితీ రుణాలను అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.