Exports | దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా తయారైంది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రగతికి సూచికైన ఎగుమతులు ఎంతకీ కోలుకోవడం లేదు. వరుసగా ఆరో నెలా దేశీయ ఎగుమతులు పతనం కావడం ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నది.
న్యూఢిల్లీ, జూన్ 15: గత నెల్లోనూ ఎగుమతులు పడిపోయాయి. దీంతో వరుసగా ఆరో నెలా దేశీయ ఎక్స్పోర్ట్స్ క్షీణించినైట్టెంది. గత ఏడాది డిసెంబర్ నుంచి మర్చెండైజ్ ఎగుమతులు కోలుకోలేకపోతుండటం ఆందోళనకరంగానే తయారైందిప్పుడు. నిరుడుతో పోల్చితే ఈ మే నెలలో 10.3 శాతం పతనమై 34.98 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. గత ఏడాది మేలో 38.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ మేరకు గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో తేలింది. దిగుమతులు కూడా 6.6 శాతం దిగజారి 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 57.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిరుడు మే నెల దిగుమతులు 61.13 బిలియన్ డాలర్లు. మరోవైపు ఎగుమతి-దిగుమతుల వ్యత్యాసాన్ని తెలిపే వాణిజ్య లోటు గత నెల 5 నెలల గరిష్ఠాన్ని చేరుతూ 22.12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కలిపి ఎగుమతులు 69.72 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాదితో చూస్తే 11.41 శాతం తగ్గాయి. దిగుమతులూ 10.24 శాతం దిగి 107 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు 37.26 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
దేశీయ ఎగుమతుల్లో కీలకంగా ఉన్న పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు-ఆభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రెడిమేడ్ దుస్తులు, రసాయనాలకు విదేశాల్లో ఆదరణ పడిపోయినట్టు తాజా గణాంకాల్లో తేలింది. గతంతో పోల్చితే ఈ ఎగుమతులన్నీ మే నెలలో పడిపోయాయి. చాలా దేశాల్లో నెలకొన్న మాంద్యం, మందగమన పరిస్థితులే ఇందుకు కారణమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ భరత్వాల్ చెప్తున్నా.. దేశంలోకి పడిపోయిన దిగుమతులు.. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులకు అద్దం పడుతున్నది.