భారతీయ ఎగుమతులు అంతకంతకూ పడిపోతున్నాయి.
ఈ ఏడాది మొదలు ప్రతి నెలా క్షీణిస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ ఉత్పత్తులకు గిరాకీ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.
విదేశీ విపణిలో ఇన్నాళ్లూ ఆదరణ ఉన్న భారతీయ రత్నాలు-ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయిందని తాజా అధికారిక గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Exports | న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశీయ ఎగుమతులు మళ్లీ నిరాశపర్చాయి. నిరుడుతో పోల్చితే గత నెల్లోనూ క్షీణించాయి. జూలైలో 32.25 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది జూలై ఎగుమతులతో చూస్తే 15.88 శాతం పడిపోయినట్టు స్పష్టం చేసింది. విదేశీ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో భారతీయ ఉత్పత్తులకు దిగజారుతున్న గిరాకీవల్లే ఎగుమతుల్లో ఈ పతనమని మార్కెట్ వర్గాలు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. కీలకమైన పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు-ఆభరణాల ఎగుమతులు గతంతో పోల్చితే పడిపోయాయని అటు ట్రేడర్లు, ఇటు ప్రభుత్వ వర్గాలూ చెప్తున్నాయి.
దేశీయ మార్కెట్లో నీరసం
దేశీయ మార్కెట్ బలహీనతను పడిపోయిన దిగుమతులు సూచిస్తున్నాయి. ఆయా రంగాలను ఆవరించిన నీరస పరిస్థితులు.. జూలైలో వివిధ దేశాల నుంచి భారత్లోకి జరిగిన దిగుమతుల విలువను 52.92 బిలియన్ డాలర్లకే పరిమితం చేశాయి. నిరుడు జూలైలో 63.77 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగగా, గత నెల 17 శాతం క్షీణించినట్టు తేలింది. మరోవైపు వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా ఉన్నది. గత ఏడాది జూలైలో 25.43 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తుచేసింది. అయితే ఎగుమతులు పెరిగి, దిగుమతులు తగ్గినప్పుడు వాణిజ్య లోటు తగ్గుముఖం పడితే కొంత సంతోషించాలిగానీ.. ఈ రకంగా వాణిజ్య లోటు దిగితే అది ఆమోదయోగ్యం కాదన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నది. మోదీ సర్కారు.. మేకిన్ ఇండియా బలోపేతానికి ఏ చర్యలు తీసుకున్నా.. పైపైకేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో ఉత్పాదకత పెరిగితే ఆ ప్రయోజనాలు దేశ ఆర్థిక వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తాయని, కానీ ఆ రకమైన సంకేతాలే లేవని వారు చెప్తుండటం గమనార్హం.
అంతటా ప్రతికూలమే
భారతీయ ఎగమతులకు ప్రధానమైన అమెరికా, ఐరోపా వంటి మార్కెట్లలో ఆశాజనక పరిస్థితులు లేవని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్తవాల్ అన్నారు. క్రమేణా ఆయా దేశాలు తమ దిగుమతులను తగ్గించుకోవడం కొంత ఆందోళనకరమేనని అభిప్రాయపడ్డ ఆయన.. అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ ఎగుమతులు ఎక్కువగానే జరుగుతాయన్న విశ్వాసాన్ని కనబర్చారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ మరికొన్ని రంగాలు మంచి ప్రదర్శనను ఇస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే దేశ, విదేశీ మార్కెట్లలో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏ)పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సునీల్ చెప్పారు. భారతీయ వ్యూహాత్మక అవసరాలకూ ఇది కలిసిరాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్తు ఆధారిత వాహనాల్లో వినియోగించే బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి సరుకు పెరు, చిలీ దేశాల్లో అధికంగా ఉందన్న ఆయన.. ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు.