Civil Aviation | విదేశాలకు వెళ్లే వారితోపాటు దేశీయంగా వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో విమాన యానం చేసిన ప్రయాణికులు 13 శాతం పెరిగిందని తేలింది. 2023-24లో విమాన ప్రయాణం చేసిన వారి సంఖ్య 15.4 కోట్ల మందికి చేరిందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది.
కరోనాకు ముందు విమాన ప్రయాణికుల కంటే ఇప్పుడు విమానయానం చేసే వారు పెరిగారు. 2019-20లో 14.2 కోట్ల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణం చేస్తే, గత నెలలోనే 1.35 కోట్ల మంది ప్రయాణించారు. ఇది 2022-23తో పోలిస్తే రెండు శాతం ఎక్కువ. ఫిబ్రవరిలో 1.26 కోట్ల మంది ప్రయాణించారని తేలింది.
ఇక 2023 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ విదేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 2.7 కోట్ల మంది. 2022-23తో పోలిస్తే 25 శాతం అధికంగా గతేడాది విదేశాలకు విమాన ప్రయాణం చేశారు. విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల విమానయాన రంగానికి వచ్చే నష్టం రూ.3,000 కోట్ల నుంచి రూ.4000 కోట్లకు పరిమితం అవుతుందని ఇక్రా అంచనా వేసింది.