Direct Tax Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఆరు నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు అదరగొట్టాయి. 2021-22తో పోలిస్తే ఈ ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం వృద్ధి చెందాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 8 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.98 లక్షల కోట్లకు చేరాయి. వాటిల్లో కార్పొరేట్ సంస్థల లాభాలపై స్థూల పన్ను వసూళ్లు 16.74 శాతం పెరిగితే, వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు 32.30 శాతం ఎక్కువయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్ 8 మధ్య ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.8 శాతానికి పైగా పెరిగాయి.
కార్పొరేట్ ఆదాయం, వ్యక్తిగత ఆదాయంపై వసూలు చేసే పన్నులనే ప్రత్యక్ష పన్నులు అంటారు. రీఫండ్ల సర్దుబాటు తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్ల (16.3 శాతానికి పైగా)కు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు మొత్తం బడ్జెట్ అంచనాల్లో 52.46 శాతం అని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.