Demonetisation | పాత పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేండ్లు గడిచిపోయాయి. బ్లాక్మనీ, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు 2016 నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు అప్పటి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) చెల్లుబాటు కావని పేర్కొన్నారు. నాటి చారిత్రక నిర్ణయం ఫలితంగా పాత రూ.1000 నోటు స్థానే కొత్త రూ.500, రూ.2000 నోట్లను ఆర్బీఐ జారీ చేసింది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అని నాడు అనేకమంది మదిలో తలెత్తిన ప్రశ్న ఇప్పటికి కొనసాగుతున్నది. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన కొత్త మార్పులకు మనమంతా సాక్షులమే. ఆరేండ్ల తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగినా.. అదే స్థాయిలో నగదు చెల్లింపులు నమోదవుతున్నాయి.
పాత పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి దేశంలో శరవేగంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అయినా ఇప్పటికీ 342 జిల్లాల్లో 76 శాతం మంది ప్రజలు గ్రాసరీ, రెస్టారెంట్ బిల్లులు, ఫుడ్ డెలివరీకి నగదు చెల్లింపులే జరుపుతున్నారని ఓ సర్వేలో తేలింది. పాత పెద్ద నోట్ల రద్దు నుంచి ఇప్పటి వరకు నగదు చెల్లింపులు 1.5 రెట్లు పెరిగాయి.
రోజువారీ ఖర్చులకు అత్యధిక కుటుంబాలు నగదు చెల్లింపులే జరుపుతున్నాయి. నాలుగో వంతు కుటుంబాలు ప్రయాణాలకు క్యాష్ పేమెంట్స్ చేస్తున్నాయి. ఏడాది కాలంగా గాడ్జెట్ షాపింగ్లో తక్కువ కుటుంబాలు నగదు చెల్లింపులు జరుపుతున్నాయి. బంగారం ఆభరణాల కొనుగోలు కోసం కూడా క్యాష్ చెల్లిస్తున్నాయి. పాత పెద్ద నోట్ల రద్దుతో 2016 నవంబర్ 8 నుంచి ప్రజల వద్ద నగదు నిల్వలు తగ్గిపోయాయి. కానీ 2017 జూన్ నుంచి నికరంగా పెరుగుతూ వచ్చాయి.
2016 నవంబర్ నాలుగో తేదీన ప్రజల వద్ద రూ.17.6 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. 2017 జూన్ ఆరో తేదీ నాటికి ప్రజల వద్ద క్యాష్ నిల్వలు రూ.8.98 లక్షల కోట్లకు పరిమితమైతే.. గత నెల 21న రూ.30.9 లక్షల కోట్లకు పెరిగాయి.
ఇదిలా ఉంటే, నాడు రద్దయిన పాత నోట్లలో 99 శాతానికి పైగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ డేటా చెబుతున్నది. రూ.15.41 లక్షల కోట్ల విలువైన నోట్లు విలువ కోల్పోగా, కొత్తగా రూ.15.31 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలోకి వచ్చాయి. పాత నోట్ల రద్దుతో కనీసం బ్యాంకింగ్ వ్యవస్థ బయట ఉన్న రూ.3-4 లక్షల కోట్ల తుడిచిపెట్టుకుపోతుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నది.
కానీ, పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత బ్లాక్మనీ రికవరీ అయ్యిందనే విషయం అంచనా వేయడం కష్టమే. 2019 ఫిబ్రవరిలో నాటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం తీసుకున్న బ్లాక్మనీ వ్యతిరేక చర్యల వల్ల రూ.1.3 లక్షల కోట్ల నల్లధనం రికవరీ చేశామని ప్రకటించారు. అదే టైంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. తానెప్పుడూ నోట్ల రద్దుకు మద్దతు ఇవ్వలేదని తన పుస్తకంలో పేర్కొన్నారు.
2016 నుంచి ఇప్పటి వరకు రూ.500, రూ.2000 విలువ గల నోట్లు 6,849 కోట్ల కరెన్సీ నోట్లు ముద్రించింది. వాటిలో 1680 కోట్లకుపైగా కరెన్సీ నోట్లు చలామణి నుంచి అదృశ్యమయ్యాయి. ఇలా మిస్ అయిన నోట్ల విలువ అక్షరాల రూ.9.21 లక్షల కోట్లు. ఆర్బీఐ ధ్వంసం చేసిన నోట్లలో ఈ మిస్ అయిన నోట్లు లేనే లేవు. 2017-18లో అత్యధికంగా చలామణిలో ఉన్న రూ.2000 విలువైన నోట్ల చలామణి అటుపై ఏడాదికేడాది తగ్గుతూ వచ్చింది. నాడు రూ.2000 విలువ గల నోట్లు 33,630 లక్షలు చలామణిలో ఉన్నాయి. తర్వాత రోజురోజుకు వాటి చలామణీ తగ్గుతూ వచ్చింది.
ప్రజలు రూ.2000 నోటును ఇష్టపడటం లేదంటూ, వాటిని ముద్రించడం నిలిపేస్తున్నట్లు 2019లో ఆర్బీఐ ప్రకటించింది. కానీ రూ.500 విలువైన, రూ.2000 విలువైన నోట్లను బ్లాక్ మనీ డిపాజిట్లకు వాడుకున్నారని చాలా మంది నిపుణులు, ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు. 2019 తర్వాత రూ.2000 విలువైన నోట్ల ముద్రను ఆర్బీఐ నిలిపేయడానికి ఇదే కారణం అని భావిస్తున్నారు.