KV Kamath | దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవీలు కీలకం కానున్నాయని ప్రముఖ బ్యాంకర్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ) చైర్మన్ కేవీ కామత్ స్పష్టం చేశారు. మరోవైపు వివిధ సంస్థలకు బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో మొండి బాకీలు రూ.13 లక్షల కోట్లు రద్దు చేశాయని చెప్పారు. ఇది బ్యాంకులు భారీ మూల్యం చెల్లించడమే అవుతుందన్నారు. ఐబీసీ వ్యవస్థను మెరుగు పరిస్తే మరింత లాభాలు ఉంటాయని చెప్పారు. రద్దు చేసిన రుణాల్లో 30 శాతం లోపే రికవరీ అవుతున్నాయన్నారు.
కాగా, 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీలో డిజిటల్ సెక్టార్ 25 శాతం వాటా పొందుతుందని పేర్కొన్నారు. 2028-29 నాటికి దేశ జీడీపీ 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం జీడీపీలో డిజిటల్ సెక్టార్ వాటా కేవలం నాలుగు శాతమేనని, చైనా ఎకానమీలో 40 శాతం డిజిటల్ లావాదేవీలే ఉంటాయన్నారు.
2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచంలోకెల్లా భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం, ప్రణాళికా వ్యూహకర్తలు భావిస్తున్నారని కేవీ కామత్ తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీ 3.3 లక్షల కోట్ల డాలర్లయితే, 2028-29 నాటికి ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, జపాన్ను భారత్ దాటేస్తుందని చెప్పారు.
డిజిటల్ ఎకానమీ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ-కామర్స్, ఇతర డిజిటల్ పేమెంట్స్, సర్వీసుల విభాగాలు దేశ వృద్ధిరేటులో అతిపెద్దవిగా నిలుస్తాయని కేవీ కామత్ చెప్పారు. చైనా ఎకానమీలో డిజిటల్ సెక్టార్ వాటా 40 శాతం అయినా.. భారత్లో ఆ స్థాయికి దూసుకెళ్లకపోవడానికి కారణాలేమీ కనిపించడం లేదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎక్స్ప్రెస్వేలు, హైవేలు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, హైస్పీడ్ రైళ్ల వంటి మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులను నిలువరించడానికి ఎటువంటి కారణం లేదన్నారు కేవీ కామత్. రవాణ వసతుల్లో ఇవి కీలకం అని గుర్తు చేశారు. మెరుగైన రవాణా, ప్రయాణ అవసరాల కోసం మరిన్ని ఎక్స్ప్రెస్వేలు, పెద్ద విమానాశ్రయాలు, డెడికేటెడ్ రైళ్లు అవసరం అని తెలిపారు.
వచ్చే ఐదేండ్లలో జీడీపీ ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుని ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ప్రస్తుత మౌలిక వసతులను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.