న్యూఢిల్లీ, నవంబర్ 9: ధంతేరస్ (ధనత్రయోదశి) ముందట బంగారం ధరలు దిగొచ్చాయి. గురువారం హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పసిడి ధర రూ.440 తగ్గి రూ.60,760గా ఉన్నది. 22 క్యారెట్ రేటు 10 గ్రాములు రూ.400 పడిపోయి రూ.55,700లుగా నమోదైంది. ఢిల్లీలోనూ రూ.400 కోల్పోయి 24 క్యారెట్ గోల్డ్ రూ.60,950 పలికింది. నిజానికి గత ఆరు రోజుల్లో బంగారం ధరలు సుమారు వెయ్యి రూపాయలదాకా తగ్గుముఖం పట్టాయి. కాగా, ఈ ఏడాది ధంతేరస్ శుక్రవారం వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజున బంగారం, వెండి తదితర విలువైన లోహాలు, వాటితో తయారైన నగలు, వస్తూత్పత్తుల కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల నమ్మకం.
ఈ ధంతేరస్కు బంగారు ఆభరణాలు, బులియన్ అమ్మకాలు నిరుడుతో పోల్చితే 10 శాతం మాత్రమే పెరుగవచ్చని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ధరలు 20 శాతానికిపైగా పెరిగాయని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే సేల్స్పై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం లేదన్న అభిప్రాయాలు నగల వర్తకుల నుంచి వినిపిస్తున్నాయి. గత ఏడాది ధంతేరస్ రోజున తులం 24 క్యారెట్ బంగారం రేటు రూ.50,139 (పన్నులు అదనం) పలికింది. అంతకుముందు సంవత్సరం 2021లో రూ.47,644గా ఉన్నది.