Shiv Nadar | న్యూఢిల్లీ : వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోనే కాదు.. దాతృత్వంలోనూ తమ పెద్దరికాన్ని చాటుతున్నారు హెచ్సీఎల్టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, ఆయన కుటుంబ సభ్యులు. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రోజుకు రూ.5.6 కోట్ల చొప్పున విరాళాలు ఇచ్చినట్టు తేలింది. ఈ మార్చి ఆఖరుతో ముగిసిన ఏడాదికిగాను ఎడెల్గీవ్ హురున్ ఇండియా ఫిలంత్రఫీ జాబితా-2023 గురువారం విడుదలైంది.
ఇందులో శివ్ నాడార్, ఆయన కుటుంబం అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నది. మొత్తం రూ.2,042 కోట్ల విరాళాలిచ్చారు. శివ్ నాడార్ ఒక్కరే రూ.1,899 కోట్లు దానం చేశారు. ఇక ఇది 10వ జాబితా అవగా.. గత ఐదు వార్షిక జాబితాల్లో నాడార్, ఆయన కుటుంబమే మూడుసార్లు ప్రథమ స్థానంలో ఉండటం గమనార్హం. కాగా, ఆర్ట్స్, కల్చర్, హెరిటేజ్ రంగాలకు శివ్ నాడార్, ఆయన కుటుంబం నుంచి విరాళాలు వెళ్లాయి. అంతేగాక 2021-22తో పోల్చితే ఈసారి 76 శాతం పెరగడం విశేషం.
ప్రేమ్జీ రూ.1,774 కోట్లు
విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్జీ, ఆయన కుటుంబం గత ఆర్థిక సంవత్సరం రూ.1,774 కోట్ల విరాళాలిచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఏకంగా 267 శాతం పెరగడం గమనార్హం. ఇందులో అజీమ్ ప్రేమ్జీ వాటానే రూ.1,638 కోట్లున్నది. విద్యా కోసం ఈ విరాళాలు వెళ్లాయని ఎడెల్గీవ్ హురున్ వెల్లడించింది. ఇదిలావుంటే దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు రూ.376 కోట్ల విరాళాలే ఇచ్చారు.
పైగా నిరుడుతో పోల్చితే 8 శాతం తగ్గడం గమనించదగ్గ అంశం. ఆరోగ్య సంరక్షణకు ఈ విరాళాలు వెళ్లాయి. ఇక మొన్నటిదాకా భారతీయ అపర కుబేరుడిగా ఉండి, హిండెన్బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ సారథి గౌతమ్ అదానీ విరాళాలు రూ.285 కోట్లుగా ఉన్నాయి. ఎక్కువమంది విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం విరాళాలిచ్చారు. ఇక నందన్ నిలేకని, ఆయన భార్య రోహిణి నిలేకని కలిసి రూ.359 కోట్ల విరాళాలిచ్చారు. టాప్-10లో పేరున్న ఏకైక మహిళ సైతం రోహిణి నిలేకనే.