Singareni | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తాడిచర్ల కోల్ బ్లాక్-2లో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయడానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని, త్వరలోనే అప్రూవల్ వస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. సింగరేణికి కావాల్సిన గనులు, ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం గురువారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని, వర్చువల్ మీటరింగ్ విధానంతో పేదల ఇండ్లకు సౌర విద్యుత్తును అందించే విషయమై కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ను కలిశారు.
వారికి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల కోల్ బ్లాక్-2ను 2013లోనే సింగరేణికి కేటాయించారని గుర్తుచేశారు. 30 ఏండ్లపాటు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను ఇక్కడ వెలికితీసే అవకాశముందని తెలిపారు. అలాగే జైపూర్ పవర్ ప్లాంట్లో థర్మల్ విద్యుదుత్పత్తి కోసం సింగరేణికి ఒడిశాలో కేటాయించిన నైని బొగ్గు గనుల్లో తవ్వకాలకున్న అడ్డంకులను తొలగించాలని కూడా జోషికి విన్నవించినట్టు భట్టి తెలియజేశారు.
దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని అనుమతులు వచ్చేలా ప్రయత్నిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సింగ్ సానుకూలంగా స్పందించారని భట్టి తెలియజేశారు. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఈ పర్యటనలో భట్టి వెంట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తదితరులున్నారు.