న్యూఢిల్లీ, ఆగస్టు 30: పంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ తరహాలో ఆర్బీఐ నిషేధానికి గురికావడం లేదా మారిటోరియం విధింపునకు లోనైన బ్యాంకుల డిపాజిట్దార్లకు రూ.5 లక్షల వరకూ చెల్లింపు నవంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్ట సవరణను సోమవారం కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసింది. ఈ సవరణ బిల్లు ఈ నెల తొలినాళ్లలో పార్లమెంటు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇబ్బందుల్లో చిక్కుకున్న బ్యాంకులపై రిజర్వుబ్యాంక్ మారిటోరియం విధించిన 90 రోజుల్లోగా రూ.5 లక్షల వరకూ డిపాజిట్ మొత్తాన్ని చెల్లించేలా చట్టాన్ని సవరించారు. ఈ చట్ట నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని, ఈ ప్రకారం నవంబర్ 30వ తేదీనాటికి డిపాజిటర్లు వారి మొత్తాన్ని డీఐసీజీసీ నుంచి పొందగలుగుతారని ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. దేశంలో సమస్యల్ని ఎదుర్కొంటున్న మొత్తం 23 సహకార బ్యాంకులపై రిజర్వుబ్యాంక్ నియంత్రణల్ని విధించిన నేపథ్యంలో ఆ బ్యాంకుల డిపాజిటర్లకు మరో మూడునెలల్లో సోమ్ము చేతికి అందనుంది. ఇప్పటివరకూ దివాలా బ్యాంకుల డిపాజిటర్లు వారి డిపాజిట్ మొత్తాన్ని రాబట్టుకునేందుకు 8-10 సంవత్సరాల సమయం పట్టేది. ప్రతీ బ్యాంకూ రూ.100 డిపాజిట్పై 10 పైసల చొప్పున బీమా ప్రీమియంను రిజర్వుబ్యాంక్ సబ్సిడరీ అయిన డీఐసీజీసీకి చెల్లిస్తుంది.