Demat Accounts | ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైం రికార్డులు నమోదు చేస్తున్నాయి. వివిధ సంస్థల ఐపీఓలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కె్ట్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు పెరిగిపోతున్నారు. దీనికి గత నెలలో పెరిగిన డీమ్యాట్ ఖాతాలే నిదర్శనం. 2022తో పోలిస్తే గత నెలలో 26 శాతం డీమ్యాట్ ఖాతాలు పెరగడంతో దేశంలో డీమ్యాట్ ఖాతాలు గల వారు 12.7 కోట్ల మందికి చేరారు. 2022లో ఇదే సమయానికి దేశంలో 10.1 కోట్ల డీమ్యాట్ ఖాతాలే ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలలో సరాసరి 21 లక్షల డీమ్యాట్ ఖాతాలు పెరిగాయి. జూలైలో కొత్తగా 30 లక్షల మంది డీమ్యాట్ ఖాతాలు ప్రారంభిస్తే.. గత నెలలో 31 లక్షల మంది కొత్త ఖాతాలు తెరిచారు. వాటిలో ఎన్ఎస్డీఎల్ వద్ద 3.3 కోట్లు, సీడీఎస్ఎల్ వద్ద 9.35 కోట్ల డీమ్యాట్ ఖాతాలో నమోదయ్యాయి.
స్టాక్స్ నుంచి ఆకర్షణీయ రిటర్న్స్ వస్తుండటం.. డీమ్యాట్ ఖాతాలు పెరగడానికి కారణం అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆర్థికాంశాల్లో యువతకు అవగాహన పెరగడంతోపాటు బ్యాంకులు మొదలు ఫిన్ టెక్ సంస్థలు, స్టాక్ బ్రోకరేజీ సంస్థలు సైతం తేలిగ్గా అవకాశం కల్పిస్తుండటంతో డీమ్యాట్ ఖాతాలు పెరుగుతున్నాయంటున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో చురుగ్గా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాదారుల సంఖ్య గత నెలలో 3.27 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే 2.5 శాతం ఎక్కువ. డీమ్యాట్ ఖాతాదారులతో స్టాక్స్లో లావాదేవీలు నిర్వహిస్తున్న సంస్థల్లో టాప్-5 డిస్కౌంట్ సంస్థలుగా జెరోదా, ఏంజిల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ సంస్థలు 60.8 శాతం వాటా కలిగి ఉన్నాయి.