Demat Accounts | దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటే డీ-మ్యాట్ ఖాతా కలిగి ఉండాల్సిందే. కొవిడ్-19కి ముందు అంటే 2020 మార్చికి ముందుతో పోలిస్తే ఆగస్ట్ నెలలో డీమ్యాట్ ఖాతాలు 10 కోట్ల మైలురాయిని దాటాయి. 2020 తర్వాత రెట్టింపుకు పైగా డీమ్యాట్ ఖాతాలు పెరగడం గమనార్హం. కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి 2020 మార్చి నెలాఖరు నుంచి దాదాపు ఏడాది పాటు కఠిన లాక్డౌన్ అమల్లో ఉంది. కరోనా ప్రారంభంలో భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాతీ కాలంలో పుంజుకున్నాయి. గత నెల డిపాజిటరీ సంస్థలు.. సీడీఎస్ఎల్లో 7.2 కోట్లు, ఎన్ఎస్డీఎల్లో 2.9 కోట్ల మంది డీ-మ్యాట్ ఖాతాదారులు ఉన్నారు.
గతేడాది జనవరి నాటికి మొత్తం డీ-మ్యాట్ ఖాతాదారులు ఐదు కోట్ల మైలు రాయిని దాటారు. 2020 మార్చిలో ఇది కేవలం 4.1 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్ , వీడియో ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియ వంటి రెగ్యులేటరీ మార్పులు, బ్రోకరేజీ సంస్థల డిస్కౌంట్ పెంపు తదితర కారణాలతో డీమ్యాట్ ఖాతాల సంఖ్య శరవేగంగా పెరిగింది. గమ్మత్తేమిటంటే మెట్రో నగరాలు, అతిపెద్ద సిటీల కంటే ఇతర ప్రాంతాల్లో డీ-మ్యాట్ ఖాతాలు పెరగడం ఆసక్తి కర పరిణామం.
ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సంస్కృతి నెమ్మదిగా ఉన్నా, ద్వీతీయ, తృతీయ శ్రేణి నగరాల్లో నికరంగా పుంజుకుంటున్నదని యాక్సిస్ సెక్యూరిటీస్ ఎండీ కం సీఈవో బీ గోప్ కుమార్ తెలిపారు. బ్రోకరేజీ సంస్థలు డిస్కౌంట్లు ఆఫర్ చేయడంతో సీడీఎస్ఎల్లో డీ-మ్యాట్ ఖాతాల సంఖ్య పెరిగింది. దీంతో సీడీఎస్ఎల్లో చేరిన డీ-మ్యాట్ ఖాతాదారుల సంఖ్య 70 శాతం మార్కెట్ను అందుకున్నది. సంప్రదాయ బ్రోకరేజీ సంస్థలకు నిలయంగా ఉన్న ఎన్ఎస్డీఎల్ తోనే కొనసాగుతున్నారు.