న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పడిపోతున్నది. సరఫరా వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందులు, డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి మధ్యకాలంలో) స్మార్ట్ఫోన్ల విక్రయాలు మూడు శాతం తగ్గాయని కౌంటర్పాయింట్ రిసెర్చ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గడిచిన ఆరేండ్లలో ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారని పేర్కొంది.
దేశీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నదని, భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని కౌంటర్పాయింట్ రిసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. మొత్తంమీద ఈ ఏడాదిలో స్మార్ట్ఫోన్ల మార్కెట్ 10 శాతం పడిపోనున్నట్టు ఆయన అంచనావేస్తున్నారు. ద్రవ్యోల్బణ గణాంకాలు పెరుగుతుండటం, మరోవైపు చిప్ల కొరత అధికమవుతుండటం కూడా మరో కారణమన్నారు.