ముంబై, ఫిబ్రవరి 25: హైదరాబాద్లో మాల్స్కు గిరాకీ పెరుగుతున్నది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాల్ స్పేస్కు ఇక్కడే ఎక్కువ డిమాండ్ కనిపిస్తున్నట్టు రియల్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక సైతం ఇందుకు అనుగుణంగానే ఉన్నది. దేశ, విదేశీ వ్యాపార సంస్థలు హైదరాబాద్లో తమ మాల్స్ను ఏర్పాటు చేసుకోవడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుండటంతో షాపింగ్ మాల్స్ స్థలాలు హాట్కేకులైపోయాయి. వచ్చే 4-5 ఏండ్లలో దేశంలోని టాప్-7 నగరాల్లో 2.5 కోట్ల చదరపు అడుగుల మాల్ స్పేస్ కొత్తగా అందుబాటులోకి రానున్నదని అనరాక్ అంచనా వేసింది. ఇందులో 46 శాతం (కోటి చదరపు అడుగులకుపైగా) మాల్ స్పేస్ హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోనే రాబోతున్నట్టు చెప్పింది. 19 శాతంతో బెంగళూరు రెండో స్థానంలో ఉన్నది.
గత ఏడాదీ దూకుడే..
గత ఏడాది హైదరాబాద్సహా దేశంలోని టాప్-7 నగరాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మాల్ స్పేస్ 26 లక్షల చదరపు అడుగులుగా ఉన్నది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 27 శాతం పెరిగింది. అయితే నిరుడు హైదరాబాద్, బెంగళూరుల్లో మాత్రమే అదనంగా మాల్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. దీంతో కరోనా ప్రభావం నుంచి నగర మార్కెట్ కోలుకున్నదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక కరోనా ముందుతో చూస్తే మాల్స్ అద్దెలు కూడా దాదాపు 15 శాతం పెరిగాయని అనరాక్ తెలియజేసింది. 2019 నుంచి 2022 మధ్య రిటైల్ రంగం సుమారు 1,473 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగా, ఇందులో హైదరాబాద్ వాటా కూడా బాగానే ఉందని తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల్లోనూ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్తో కలిసి హైదరాబాద్ ముందు వరుసలో ఉండటం విశేషం.