న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతున్నది. హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్ పరిస్థితులపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ నివేదికను రూపొందించింది. బుధవారం విడుదలైన ఈ రిపోర్టు ప్రకారం.. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్స్ పోర్ట్ఫోలియో ప్రస్తుతం 53.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నది. అయితే 2025 నాటికి 52 శాతం ఎగిసి 81 మిలియన్ చదరపు అడుగులకు చేరుతుందని అంచనా వేసింది. కార్పొరేట్ల నుంచి వస్తున్న ఆదరణతో ఇది సాధ్యమేనని ‘ఫ్లెక్సింగ్ ది వర్క్స్పేస్-బ్యాక్ టు ఆఫీస్’ పేరిట తెచ్చిన తాజా నివేదికలో అభిప్రాయపడింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్ బాట పడుతున్నది విదితమే. ఈ క్రమంలో పెరుగుతున్న ఆఫీస్ స్పేస్ డిమాండ్కు తాజా నివేదిక అద్దం పడుతున్నది.
ఇక హైదరాబాద్లో హైటెక్ సిటీ.. ప్రధాన ఆఫీస్ ఏరియాగా ఉందని చెప్పింది. అలాగే బెంగళూరులో వైట్ఫీల్డ్, పుణెలో బనేర్, ముంబైలో అంధేరీ ఈస్ట్, గురుగ్రామ్లో డీఎల్ఎఫ్ సైబర్సిటీ ఉన్నాయన్నది. ఇక దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా సెంటర్లలో విస్తరించిన ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల వద్ద 7.6 లక్షలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నది. దేశీయంగా 50 పెద్ద ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లున్నారని, ఇందులో టాప్-10 ఆపరేటర్స్ వద్దే మొత్తం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్ఫోలియోలో 84 శాతం ఉన్నదని ఈ సందర్భంగా వెస్టియన్ వివరించింది. వుయ్వర్క్ ఇండియా, స్మార్ట్వర్క్స్, సింప్లీవర్క్ ఆఫీసెస్, ఆఫీస్, టేబుల్ స్పేస్, ది ఎగ్జిక్యూటివ్ సెంటర్, అర్బన్ వాల్ట్, ఇండీక్యూబ్, ఇంకస్పేజ్, 91స్ప్రింగ్బోర్డ్, అవంతా ఇండియా, తదితర సంస్థలు ప్రధాన కో-వర్కింగ్/ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్లుగా ఉన్నాయి.