న్యూఢిల్లీ, నవంబర్ 27: వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఎలక్ట్రిక్ బస్సులు (ఈ-బస్లు) అమ్మకాలు జోరుగా పెరుగుతాయని, దేశంలో మొత్తం కొత్త బస్ల విక్రయాల్లో ఈ-బస్ల వాటా 13 శాతానికి పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. సాధారణ డీజిల్ బస్లతో పోలిస్తే నిర్వహణా వ్యయాలు గణనీయంగా తగ్గనున్నందున, ఈ-బస్ల సమీకరణకు పలు రాష్ర్టాలు వాటి ఈవీ పాలసీల్లో నిర్దేశిత లక్ష్యాల్ని ప్రకటించాయని, ఈ కారణంగా వీటికి డిమాండ్ పెరుగుతుందని ఇక్రా వివరించింది.
ప్రభుత్వ సబ్సిడీలు, కొత్తగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీలతో ఈ-బస్ల కొనుగోలుకు అయ్యే వ్యయం మరింత తగ్గుతుందన్నది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్త బస్ల అమ్మకాల్లో ఈ-బస్ల వాటా ఏడు శాతం ఉండగా, ఫేమ్ స్కీమ్ 2024 మార్చితో ముగియనున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాలు మరింత జోరందుకుంటాయని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది.