Dell : రిమోట్ వర్కర్లకు ప్రముఖ ల్యాప్టాప్ బ్రాండ్ డెల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులను ప్రమోషన్స్లో పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కోవిడ్-19 మహమ్మారి కంటే ముందుగానే డెల్ హైబ్రిడ్ వర్క్ కల్చర్ను అనుసరిస్తోంది. దాదాపు పది, పన్నెండేండ్ల నుంచి హైబ్రిడ్ వర్క్ మోడల్ను డెల్ అనుసరిస్తోంది. అయితే ప్రస్తుతం ఉద్యోగులంతా విధిగా తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలనే నిబంధలను కఠినంగా అమలు చేస్తోంది.
హైబ్రిడ్ ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజుల పాటు కార్యాలయాల నుంచి పనిచేయాలని డెల్ ఇటీవల ఉద్యోగులకు మెమో జారీ చేసింది. రిమోట్ వర్కర్లు పదోన్నతులు రావని, కంపెనీలో అంతర్గతంగా రోల్స్ మార్చేందుకు అనుమతించబోమని కంపెనీ స్పష్టం చేసింది. డెల్ పని గురించే ఆలోచిస్తుందని, లొకేషన్ గురించి కాదని, ప్రతి టీమ్లోనూ 10 నుంచి 15 శాతం ఉద్యోగులు రిమోట్ వర్కర్లేనని ఓ సీనియర్ ఉద్యోగి తెలిపారు.
డెల్ నూతన నిబంధన డెల్ ఉద్యోగులను షాక్కు గురిచేసిందని చెప్పుకొచ్చారు. డెల్ తన విధానంలో భారీ మార్పు తీసుకురావడం పట్ల ఉద్యోగులు కలత చెందుతున్నారు. ఉద్యోగులందరూ ఇంటి నుంచి పనిచేసే విధానానికి డెల్ బాస్ మైఖేల్ డెల్ సానుకూలంగా ఉండేవారు. కార్యాలయాలకు తిరిగి రావాలని ఇతర కంపెనీలు వారి ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరైంది కాదని కూడా మైఖేల్ డెల్ చెబుతుండేవారు. అయితే డెల్ యూటర్న్ తీసుకోవడం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నూతన ఆలోచనలతో ముందుకొచ్చేందుకు ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండాలని, ఇది కంపెనీకి మేలు చేస్తుందని నూతన నిబంధనలను డెల్ సమర్ధించుకుంటోంది.
Read More :
Singer Mangli | సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం