SpiceJet | దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ విమానం ఒకటి అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం కరాచీ విమానాశ్రయంలో ల్యాండయింది. ఢిల్లీ నుంచి దుబాయికి బయలుదేరిన విమానంలో ఫ్యూయల్ ఇండికేటర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో ల్యాండయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. గత 17 రోజుల్లో స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడం ఇది ఆరోసారి. గత ఐదు ఘటనలతో కలిపి మొత్తం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.
ఢిల్లీ- నుంచి దుబాయి బయలుదేరిన స్పైస్జెట్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ట్యాంకులో ఫ్యూయల్ పరిమాణం తగ్గినట్లు సంఏకతాలు వచ్చాయి. దీంతో కరాచీకి దారి మళ్లించారని డీజీసీఏ అధికారులు తెలిపారు. కరాచీ విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీలో ఆయిల్ ట్యాంక్ లీక్ అయినట్లు కనిపించలేదని పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (పీసీఏఏ) ధృవీకరించింది. స్పైస్జెట్ విమాన పైలట్ తమ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అత్యవసర ల్యాండింగ్కు అనుమతించాలని కోరారని పీసీఏఏ అధికారి చెప్పారు. మానవత్వ కోణంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతించామన్నారు. ఆ సమయంలో విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు.
గత నెల 19 నుంచి స్పైస్జెట్ విమానాల్లో ఆరు దఫాలు సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్ 19న పాట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఇంజిన్ దెబ్బతిన్నది. అదే రోజు జబల్పూర్-ఢిల్లీ విమానంలో మరో సమస్య తలెత్తింది.
గత నెల 24,25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తింది. దీంతో ఆ రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల రెండో తేదీన జబల్పూర్-ఢిల్లీ విమానం క్యాబిన్లో పొగలు వచ్చాయి.