ముంబై, మార్చి 10: గత నెల ఫిబ్రవరిలో భారతీయ పరిశ్రమ.. డైరెక్ట్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే 67 శాతం క్షీణించి 2.28 బిలియన్ డాలర్ల నుంచి 753.61 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలియజేసింది. ఈ ఏడాది జనవరితో చూసినా 56 శాతం తగ్గాయి. అప్పుడు 1.71 బిలియన్ డాలర్ల పెట్టుబడులు జరిగాయి. ఔట్వర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఓఎఫ్డీఐ)లో భాగంగా విదేశీ వెంచర్లలో దేశీయ సంస్థాగత మదుపరులు ఈ పెట్టుబడులు పెడుతున్నారు. కాగా, ఈసారి పెట్టుబడుల్లో ఈక్విటీ ఇన్ఫ్యూషన్లో 237.84 మిలియన్ డాలర్లు, రుణాలుగా 230.06 మిలియన్ డాలర్లు, గ్యారంటీల జారీ ద్వారా 285.72 మిలియన్ డాలర్లు ఉన్నట్టు ఆర్బీఐ తెలియజేసింది. ఇందులో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ పెట్టుబడులు 47 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రష్యాలోని ఓ జాయింట్ వెంచర్లో పెట్టింది. ఇక మధురిమ ఇంటర్నేషనల్ పెట్టుబడులు 40.91 మిలియన్ డాలర్లుగా ఉండగా, అమెరికాలోని ఓ జాయింట్ వెంచర్లో ఇన్వెస్ట్ చేసింది. యూఏఈలోని డబ్ల్యూవోఎస్లో టైటాన్ సంస్థ 29.5 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అలాగే సింగపూర్లోని ఓ అనుబంధ సంస్థలో ఇమాజిన్ మార్కెటింగ్ 26.06 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టగా, సౌదీ అరేబియాలోని జాయింట్ వెంచర్లో కేఈసీ ఇంటర్నేషనల్ 15.99 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్టు రిజర్వ్ బ్యాంక్ వివరించింది.