కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ.. దేశ సగటు కన్నా ముందు వరుసలో ఉన్నదని, ఇతర రాష్ర్టాలతో పోల్చితే మొదటి స్థానంలో నిలిచిందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అయితే అసలు సమస్య వ్యాక్సిన్ కొరతేనని చెప్పారు. రాష్ర్టాలకు వ్యాక్సిన్ పంపిణీ అంశం పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉన్నదని, రాష్ర్టానికి వీలైనంత ఎక్కువ డోసులు తెచ్చేలా కేంద్రంతో ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్.. కొవిడ్ నియంత్రణ, సంబంధింత అంశాలపై గురువారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో సంభాషించారు. ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట జరిగిన ఈ సంభాషణలో భాగంగా పలువురు నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘ఆస్క్ కేటీఆర్’ హ్యాష్ట్యాగ్ జాతీయస్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్లో నంబర్ వన్గా నిలువడం విశేషం
రాష్ట్రంలో లాక్డౌన్ సమర్థంగా కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సంపూర్ణ లాక్డౌన్ విధించలేదని కొందరు విమర్శిస్తున్నా.. ప్రజల సౌకర్యార్థం 4 గంటలు వెసులుబాటు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జ్వర సర్వే ఇప్పటికే 70 లక్షల ఇండ్లల్లో పూర్తయిందన్నారు. దీంతోపాటు మంత్రులంతా జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కలెక్టర్, డీఎంహెచ్వో, స్థానిక దవాఖానల అధికారులతో నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నంలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలూ భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ చర్యలతోపాటు లాక్డౌన్ వల్ల కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సర్వే వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను త్వరలోనే చూస్తారన్నారు.
వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కన్నా తెలంగాణ ముందువరసలో ఉన్నదని, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కూడా రాష్ట్రం మెరుగ్గా ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రతి పదిలక్షల మందిలో 1,41,939 మందికి టీకాలు వేశాం. అదే దేశంలో 1,29,574మందికి, ఏపీలో 1,39,986 మందికి, తమిళనాడులో 87,021 మందికి, ఉత్తరప్రదేశ్లో 61,164 మందికే వేశారు. అసలు సమస్య వ్యాక్సిన్ కొరత. వ్యాక్సిన్ పంపిణీ అంశం పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉన్నది. ఆయా సంస్థలు తయారుచేసే డోసుల్లో 85% కేంద్రానికి ఇవ్వాల్సిందే. మిగిలిన 15% రాష్ర్టాలు, ఇతరులు కొనుగోలు చేసుకోవాలి. వాక్సిన్ సరఫరాను పెంచేలా కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు భారత్ బయోటెక్, సీరం, డా.రెడ్డీస్తో చర్చిస్తున్నాం. కానీ అవి దేశానికి అవసరమైన వ్యాక్సిన్ల సంఖ్యను జూలై చివరికి లేదా ఆగస్టులో అందుకునే అవకాశం ఉంది. 70% ప్రజలకు వ్యాక్సిన్ వేస్తే కరోనా చైన్ను బ్రేక్ చేయొచ్చు.
ఇందుకు రాష్ట్రంలో ఉన్న 2.9 కోట్ల మంది పెద్ద వయస్సు వారిలో 1.9 కోట్ల మందికి వేయాల్సి ఉంటుంది. వీరికి రెండు డోసుల వేసేందుకు 3.8 కోట్ల డోసులు కావాలి’ అని పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 45 ఏండ్లకు పైబడి ఉన్న జనాభా సుమారు 92 లక్షలు ఉండగా, ఇందులో 45 లక్షలకు పైగా ప్రజలకు మొదటి డోస్ వ్యాక్సిన్ అందిందన్నారు. మరో 10 లక్షల మందికి పైగా రెండో డోసు కూడా పూర్తయిందని తెలిపారు.
మొదటి డోస్ తీసుకున్నవారందరికీ రెండో డోస్ ఇవ్వటమే తమ తొలి ప్రాధాన్యమన్నారు. రోజుకు 9 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం రాష్ర్ట ప్రభుత్వానికి ఉన్నదని తెలిపారు. తగినంత వ్యాక్సిన్లు సరఫరా కానప్పుడు మూడున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణ లాంటి రాష్ర్టాల్లో టీకాల ప్రక్రియను వేగవంతం చేయడం సవాలేనన్నారు. తాము ప్రతిపాదించిన గ్లోబల్ టెండర్లలో మూడు సంస్థలు పాల్గొనే అవకాశం ఉన్నదని చెప్పారు. త్వరలోనే ఫైజర్, మోడర్నా కంపెనీల వ్యాక్సిన్లకు సైతం అనుమతి లభిస్తుందని, ఆగస్టు నెలాఖరుకు బయోలాజికల్-ఈ తయారుచేస్తున్న వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా జూలై/ఆగస్ట్ రెండో వారం నాటికి వ్యాక్సిన్ల సరఫరా తగినంత ఉండే అవకాశం ఉన్నదని అంచనా వేశారు. అప్పటివరకు వాక్సినేషన్ కొంత సవాల్తో కూడుకున్నదని అన్నారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్లు వేయడానికి కూడా టీకాల కొరతే ప్రధాన సమస్య అన్నారు. 45 రోజుల్లోనే ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేసే వ్యవస్థ, సౌకర్యాలు మనవద్ద ఉన్నాయన్నారు.
గ్లోబల్ టెండర్లు పిలవడంపై ఓ కాంగ్రెస్ నేత చేసిన విమర్శలపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేద్దామని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాలను కొంతమంది దుష్ర్పచారం, అసత్యాలతో బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాటితో అయోమయానికి గురి కావద్దని కోరారు. ప్రైవేట్ దవాఖానలు కొవిడ్ రోగులను దోచుకుంటున్నాయని, ఇందుకు సంబంధించి చికిత్స, ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలని చేసిన సూచనకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ అంశంపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. కొవాగ్జిన్ ఫార్ములాను భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకొనే అంశంపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. బ్లాక్ ఫంగస్ కేసులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన మందులను సమకూర్చుతున్నామని చెప్పారు.
కరోనాకు సంబంధించి సహాయం కోసం 108 లేదా 040-21111111కు ఫోన్ చేయొచ్చని మంత్రి కేటీఆర్ సూచించారు. పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 1098, 040-23733665 హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపులో భాగంగా ఇచ్చిన 90కి పైగా అంబులెన్స్ల ద్వారా ఈ విపత్కర సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సంక్షోభ కాలంలో కొవిడ్ నియంత్రణకు పనిచేస్తున్న పౌరులు, సంస్థల సేవలను కొనియాడిన కేటీఆర్.. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కొవిడ్ సంక్షోభం మన రాష్ర్టంలో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ ప్రాధాన్యతను తెలిపిందని, ఫార్మాసిటీ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా మారబోతున్నదని అన్నారు. తెలంగాణకు ఇతర దేశాల నుంచి విమానాలు రాకుండా అడ్డుకునే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని, అది రాష్ర్ట సబ్జెక్ట్ కాదని తెలిపారు.
మొదటి దశ సంక్షోభం నుంచి రాష్ర్ట ప్రభుత్వం ఎంతో నేర్చుకున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు గణాంకాలను పోస్ట్ చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ నాటికి ఆక్సిజన్ బెడ్లు రాష్ర్టంలో 9,213 ఉంటే ప్రస్తుతం అవి 20,739గా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ తెలంగాణ వారికే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్ట, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న రోగులకు సైతం చికిత్స అందిస్తున్నదని అన్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నంలో భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
రోజూ 4 గంటలపాటు వెసులుబాటు ఉంటుంది. దీంతోపాటు ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా నిత్యావసరాలు, ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ సేవలు రోజంతా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పూర్తి లాక్డౌన్ విధించకపోవడంపై అనేకమంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఈ వెసులుబాటు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నదని గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 11న రాష్ట్రంలో 75,289 టెస్టులు చేయగా, 4,801 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.69% నమోదైంది. జాతీయ సగటు 7.59% ఉన్నది. ప్రతి 10 లక్షల జనాభాకు కనీసం 5,600 కరోనా టెస్టులు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. తెలంగాణలో ఇప్పటివరకు 3.69 లక్షల మందికి నిర్వహించాం. జాతీయ సగటు 2.30 లక్షలే. తెలంగాణలో మరణాలరేటు 0.55% ఉంటే జాతీయ సగటు 1.09% ఉన్నది. ఐసీఎంఆర్ సైతం కరోనా లక్షణాలున్నవారు టెస్టుల కోసం ఎదురుచూడకుండా చికిత్స ప్రారంభించాలన్నది.
ఆక్సిజన్ సరఫరాను కేంద్రం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నది. దీంతో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానల్లో రెమ్డెసివిర్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహిస్తున్నాం. బ్లాక్లో అమ్మేవారిని అరెస్ట్ చేస్తున్నాం. కొందరు రోగుల కుటుంబసభ్యులు అవసరం లేకున్నా.. తమ వారికి రెమ్డెసివిర్ ఇవ్వాలని డాక్టర్లను ఒత్తిడి తెస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.
ఇది ఎవరూ ఊహించని విపత్తు. మీకు కనీసం ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి మీలాంటివారు ఫిర్యాదు చేయడం సరికాదేమో?
అసలు సమస్య వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడమే. అవసరమైన డోసులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతానికి రెండో డోస్పైనే దృష్టిపెట్టాం. రాష్ట్రంలో 45 ఏండ్లు పైబడినవారు 92.24 లక్షలమంది ఉండగా వీరిలో 45.37 లక్షల మందికి టీకాలు వేశాం. రెండోడోస్ వ్యాక్సిన్ 10.3 లక్షల మందికిపైగా పూర్తి చేశాం.
ప్రస్తుత విపత్కర సమయంలో మన ద్వేషాలు, ఈగోలు పక్కన పెట్టి ప్రజల బాగుకోసమే ఆలోచించాలి. అది చైనా తయారు చేసిన సినోవాక్ అయినా ఇతర దేశాల ఫైజర్, మోడర్నా అయినా సరే సాయం అడగాలి. నీతిఆయోగ్ లెక్కల ప్రకారం ఆగస్టు నుంచి డిసెంబరు వరకు 216 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి.
ఆక్సిజన్ లభ్యత దేశంలో ఒక చాలెంజ్గా మారింది. అయినప్పటికీ మేం ఆక్సిజన్ సరఫరాకు శక్తిమేర కృషి చేస్తున్నాం. మన వద్ద అందరికీ ఆక్సిజన్ సకాలంలో అందుతుంది కాబట్టే.. ఈ అంశంపై వ్యతిరేక వార్తలు రావడం లేదు. ఇక రెమ్డెసివిర్ కొరత లేకుండా చూస్తున్నాం. వాస్తవానికి రెమ్డెసివిర్ కరోనా రోగులందరికీ అవసరం లేదు. ఇప్పటికే బ్లాక్లో విక్రయించే వారిని అరెస్టు చేస్తున్నాం. కేసులు బుక్ చేస్తున్నాం.
నాకు కరోనా సోకిన తర్వాత మొదటి ఏడు రోజులు స్వల్పస్థాయి నుంచి తీవ్ర జ్వర లక్షణాలు కనిపించాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా బాధించింది. నేను మధుమేహ బాధితుడిని కావడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను, రక్తపోటును నియంత్రించడం సవాల్గా నిలిచింది. అయితే వైద్యనిపుణుల సూచనలను తు చ తప్పకుండా పాటించి కోలుకున్నాను. ఇప్పటికీ కాస్త నీరసంగా ఉన్నా సాధారణ స్థితికి చేరుకున్నాను.