రాబోయే పదేండ్లలో 20 రెట్లు పెరగనున్న ఇంటర్నెట్ వినియోగం: క్రెడిట్సూసీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: మెటావర్స్కు డిజిటల్ ఎకోసిస్టమ్ మార్పు.. డాటా వినియోగాన్ని పరుగులు పెట్టించనున్నది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా డాటా వినియోగం 20 రెట్లు పెరగగలదని క్రెడిట్సూసీ తాజా నివేదిక అంచనా వేసింది. మెటావర్స్ అనేది ఓ 3డీ వర్చువల్ వరల్డ్స్ నెట్వర్క్. దీనివల్ల డాటా వినియోగదారులు వర్చువల్ ప్రపంచంలో మునిగిపోయిన అనుభూతిని పొందుతారు. ‘ఇంటర్నెట్ వీడియో రద్దీ ఇప్పటికే 80 శాతంగా ఉన్నది. 30 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మెటావర్స్తో ఈ వినియోగం మరో 37 శాతం పెరగవచ్చు. వచ్చే దశాబ్దకాలంలో 20 రెట్లు వృద్ధి చెందుతుందనిపిస్తున్నది’ అని గురువారం రిపోర్టులో క్రెడిట్సూసీ అభిప్రాయపడింది.
జియో, ఎయిర్టెల్కు లబ్ధి
మెటావర్స్ రాకతో డాటా ఇండస్ట్రీలో చోటుచేసుకునే మార్పులు భారతీయ టెలికం సంస్థలకు లాభిస్తాయని, ప్రధానంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు కలిసొస్తాయని ఈ సందర్భంగా క్రెడిట్సూసీ పేర్కొన్నది. డాటా వినియోగదారులు దేశంలో ఈ రెండు సంస్థలకే ఎక్కువగా ఉన్నది తెలిసిందే.