Dalal Street : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్ని చవిచూశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లుపైగా నష్టపోగా.. నిఫ్టీ 50 పాయింట్లుపైగా నష్టపోయింది. మార్కెట్లు ఉదయం ఆశాజనకంగానే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల అంశాలు, టెక్నికల్ కొనుగోళ్లు వంటివి కలిసొచ్చి.. ఉదయం మార్కెట్ బాగుంది.
సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 200 పాయింట్ల వరకు పెరిగినట్లు కనిపించింది. కానీ, తర్వాత మార్కెట్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. వివిధ స్టాక్స్ ఒత్తిళ్లు, మార్కెట్ మిశ్రమ సంకేతాలు, టారిఫ్లు వంటివి ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్ల పతనం ప్రారంభమైంది. ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ కూడా ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మొదట సెన్సెక్స్ 379.86 పాయింట్లు పైకి ఎగిసింది. 84,258.03 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కూడా 109.55 పాయింట్లు ఎగబాకింది. 25,899.80కి చేరుకుంది. తర్వాత మళ్లీ మార్కెట్లు నష్టపోయాయి. మొత్తంగా సెన్సెక్స్ 260 పాయింట్ల వరకు నష్టపోయి, 83,600 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 25,700 వద్ద ముగిసింది. లార్సెన్ అండ్ టర్బో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్ టెల్, టాటా కన్సల్టెన్సీ వంటి సంస్థలు నష్టపోయాయి. డాలరుతో రూపాయి విలువ తగ్గి, 90.21గా కొనసాగింది. బంగారం ఔన్స్ ధర 4,528.93 డాలర్ల వద్ద, అంతర్జాతీయ క్రూడాయిల్ బ్యారెల్ ధర 64.91 డాలర్ల వద్ద కొనసాగింది.