ఈపీఎఫ్ వడ్డీరేటు 8.1 శాతానికి మోదీ సర్కార్ ఓకే
న్యూఢిల్లీ, జూన్ 3: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021-22కుగాను తగ్గించి ప్రతిపాదించిన 8.1 శాతం వడ్డీరేటును మోదీ సర్కారు ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) తెలియజేసింది. ఈపీఎఫ్ పథకం సభ్యులందరికీ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 8.1 శాతం వడ్డీరేటును చెల్లించాలన్నదానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు ఈపీఎఫ్వో కార్యాలయం ఆదేశాలు విడుదల చేసింది.
కాగా, ఈ ఏడాది మార్చిలో 2021-22 కోసం నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి వడ్డీరేటును దిగజార్చుతూ 8.1 శాతంగా ఈపీఎఫ్వో నిర్ణయించిన విషయం తెలిసిందే. 1977-78లో 8 శాతంగా వడ్డీరేటు ఉన్నది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లోకి వచ్చింది. 2020-21కి 8.5 శాతంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు వడ్డీరేటును నిర్ణయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంతో దాదాపు 5 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు నష్టం చేకూరినైట్టెంది. త్వరలోనే తగ్గిన వడ్డీరేటు ఆధారంగా సభ్యుల ఖాతాల్లో చెల్లింపులు జమ కానున్నాయి.