న్యూఢిల్లీ, మే 18: పొదుపు చర్యల్లో భాగంగా విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవడంతోపాటు విద్యుత్ వాహనాలను వినియోగించుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా, ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రధాని మోదీ సూచనలకు అనుగుణంగా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టాలని, ముఖ్యంగా విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవడంతోపాటు దేశీయంగా తమ ప్రయాణాల్లో విద్యుత్ వాహనాలకు మొగ్గుచూపాలని జారీ చేసిన సర్క్యూలర్లో సూచించింది.
ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతోపాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ బీమా సంస్థలు, ఆర్థికసేవల ఇనిస్టిట్యూషన్లు తమ ఖర్చులను నియంత్రించుకోవడంతోపాటు ఈవీల వాడకాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్లాలనుకునే చైర్పర్సన్లు, ఎండీ, సీఈవో, డైరెక్టర్లు తమ పర్యటనలు వాయిదావేసుకొని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ కావాలని సూచించింది. అలాగే ప్రస్తుతం వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది.