న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో కార్ల వినియోగదారులు భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సురక్షితమైన కార్ల కోసం మరింత చెల్లించేందుకు సిద్ధమని చెప్తున్నారు. కార్ట్రేడ్ టెక్ బ్రాండ్లో భాగమైన మొబిలిటి ఔట్లుక్ నిర్వహించిన ఓ సర్వేలో అప్గ్రేడెడ్ సెక్యూరిటీ ఫీచర్లపై మరో రూ.30 వేలకుపైగా అదనంగా ఖర్చు చేసేందుకు మూడింటా ఒక వంతు మంది సుముఖంగా ఉన్నట్లు తేలింది. ఈ అధ్యయనంలో దేశవ్యాప్తంగా దాదాపు 2.7 లక్షల మంది పాల్గొన్నారు. ‘నాలుగింటా మూడోంతుల మంది ఫైవ్ స్టార్ రేటింగ్ వాహనాలనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. భద్రత కోసం బడ్జెట్ పెరిగినా సరే అంటున్నారు’ అని సర్వే స్పష్టం చేసింది. అయితే 27 శాతం మందికి సేఫ్టీ రేటింగ్స్పై అవగాహన లేకపోవడం ఒకింత ఆందోళనకరమని సర్వే వ్యాఖ్యానించింది. అయినప్పటికీ భద్రతకు పెద్దపీట వేసేవారి సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొన్నది.
కొత్త కార్లే నయమని తాజా సర్వేలో 45 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం. యూజ్డ్ వెహికిల్స్ (సెకండ్ హ్యాండ్ కార్లు) మార్కెట్లో భారీ డిమాండ్ మధ్య ఇది ప్రాధాన్యతను సంతరించుకున్నది. తక్కువ ధరకు వస్తాయని సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసేవారు ఇటీవలి కాలంలో ఎక్కువై పోయిన విషయం తెలిసిందే. అయితే యూజ్డ్ వెహికిల్స్ కంటే న్యూ వెహికిల్సే సేఫ్ అని దాదాపు సగం మంది ఈ సర్వేలో చెప్పారు. కాగా, యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ (ఏబీఎస్), ఎయిర్బ్యాగులు, రోల్-ఓవర్ మిటిగేషన్, ఇతర సేఫ్టీ ఫీచర్లను కార్లు కొనేవారు ఎక్కువగా గమనిస్తున్నారు.
కార్లలో మరిన్ని ఫీచర్స్ రావాల్సిన అవసరం ఉందని మెజారిటీ వినియోగదారులు కోరుకుంటున్నట్లు కార్ట్రేడ్ టెక్ సీఈవో (కన్జ్యూమర్ బిజినెస్) బన్వరీలాల్ శర్మ తెలిపారు. మారుతున్న కాలం, కొత్త టెక్నాలజీ, కస్టమర్ల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కార్ల తయారీ జరిగితే విశేష స్పందన ఖాయమన్నారు. ముఖ్యంగా సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లు సమర్థవంతంగా ఉండాలన్నదే సర్వేలో అత్యధికులు కోరుకున్నదని చెప్పారు. దేశంలోని మెట్రో, నాన్-మెట్రో నగరాల్లోని కార్లు, టూవీలర్ల యజమానులతోపాటు వాహనం కొనాలనే ఆసక్తి ఉన్నవారు ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఈ సందర్భంగా శర్మ వెల్లడించారు.