భారతీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీరుతెన్నుల ఆధారంగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కదలాడుతున్నాయి. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో క్రూడాయిల్ రేట్లలో ఒడిదుడుకులు అన్ని రకాలుగా సవాళ్లను విసురుతున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ పొదుపు చర్యలకు పిలుపునివ్వడం.. దిగుమతుల్లో బంగారం, వెండి వాటాలను తగ్గించేలా పలు నిర్ణయాలు తీసుకోవడం వంటివి మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి.
మదుపర్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుందన్న భయాలు నెలకొన్నాయి మరి. దీంతో ఈ వారం కూడా సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందన్న అంచనాలే ఉన్నాయి. గత వారం తీవ్ర ఆటుపోట్ల నడుమ సెన్సెక్స్ 177.36 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి 75,415.35 దగ్గర నిలిచింది. నిఫ్టీ 75.80 పాయింట్లు లేదా 0.32 శాతం అందుకుని 23,719.30 వద్ద స్థిరపడింది.
ఇక ఈ వారం ట్రేడింగ్లో చమురు, సహజ వాయువు, జ్యుయెల్లర్స్, ఆటో, రియల్టీ రంగాల షేర్లు సెల్లింగ్ ప్రెషర్కు గురికావచ్చని చెప్తున్నారు. అయితే మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపనకు అడుగులు పడితే మార్కెట్లు పుంజుకోవచ్చు. దిగొచ్చే క్రూడాయిల్ ధరలు ఇందుకు దోహదం కాగలవు. కానీ ఇటీవల పెరిగిన పెట్రో ధరలు, అంతకుముందు పెరిగిన వంటగ్యాస్ రేట్లు.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి.
ఈ క్రమంలో వచ్చే నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు పెరుగుతాయన్న అంచనాలే వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ వారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే పెద్దపీట వేసే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. కాగా, జనవరి-మార్చికిగాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాల ప్రభావం కూడా మార్కెట్ ట్రేడింగ్పై ఒకింత ఉండనున్నది.
అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,900-24,200 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.