న్యూఢిల్లీ, ఆగస్టు 19: బంగారానికి దేశీయంగా మళ్లీ డిమాండ్ నెలకొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన నాలుగు నెలల్లో భారత్ 12.9 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. క్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతైన 12 బిలియన్ డాలర్లతో పోలిస్తే 6.4 శాతం అధికం. దీంతో కరెంట్ ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉన్నది. కానీ, జూలై నెలలో పసిడి దిగుమతులు 43 శాతం తగ్గి 2.4 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. గడిచిన నాలుగు నెలల్లో పసిడితోపాటు ఇంధన దిగుమతులు అధిమవడంతో వాణిజ్యలోటు రికార్డు స్థాయి 30 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. క్రితం ఏడాది ఇది 10.63 బిలియన్ డాలర్లుగా ఉన్నది. పసిడికి ఆభరణాల ఇండస్ట్రీ నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో దిగుమతులు పెరుగుతున్నాయని వెల్లడించింది. తొలి నాలుగు నెలల్లో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 7 శాతం ఎగబాకి 13.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.