న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డును తెగవాడేస్తున్నారు. పండుగ సీజన్కావడంతో గత నెలలో ఏకంగా 1.78 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు కేవలం క్రెడిట్ కార్డులపై జరిగాయట. సెప్టెంబర్ నెలలో నమోదైన రూ.1.42 లక్షల కోట్ల కంటే ఇది 25.35 శాతం అధికం. పాయింట్ ఆఫ్ సేల్(పీవోఎస్), ఈ-కామర్స్ ద్వారా జరిపే కొనుగోళ్లకు అత్యధికంగా క్రెడిట్ కార్డును వినియోగించినట్టు ఓ సర్వే వెల్లడించింది. వీటిలో పీవోఎస్ ద్వారా జరిగే లావాదేవీలు రూ.57,774 కోట్ల స్థాయిలో ఉండగా, అదే ఈ-కామర్స్ చెల్లింపులు రూ.1,20,794.40 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. బ్యాంకుల విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీకి చెందిన క్రెడిట్ కార్డు ద్వారా అత్యధికంగా లావాదేవీలు జరిగాయి. గత నెలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో రూ.45,173 కోట్లు జరుపగా, సెప్టెంబర్లో ఇది రూ.38,662 కోట్లుగా ఉన్నాయి. పండుగ సీజన్కు తోడు కస్టమర్లు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో క్రెడిట్ కార్డుతో అత్యధికంగా కొనుగోళ్లు జరిపారని ఇండియా రేటింగ్ అండ్ రీసర్చ్ సీనియర్ అనలిస్ట్ అంకిత్ జైన్ తెలిపారు.
భవిష్యత్తుపై నీలినీడలు
ఒకవైపు రిజర్వు బ్యాంక్ అన్సెక్యూరిటీ రుణాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు విరివిగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఈ మార్కెట్పై నీలినీడలు కమ్ముకునే అవకాశాలున్నాయి. కమర్షియల్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు అత్యధికంగా ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన మార్గదర్శకాలతో వీటి వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆర్థిక విశ్లేషకులు వెల్లడించారు.
గత నెలలో 16.90 లక్షల క్రెడిట్ కార్డులను జారీచేశారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కార్డుల సంఖ్య 9.30 కోట్ల నుంచి 9.47 కోట్లకు చేరాయి.
1.91 కోట్ల క్రెడిట్ కార్డులతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఏడాది క్రితం 1.88 కోట్లు ఉన్నారు.
అలాగే ఎస్బీఐ కార్డుకి 1.8 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 1.6 కోట్లు, యాక్సిస్ బ్యాంక్కు 1.33 కోట్లు క్రెడిట్ కార్డు కస్టమర్లు కలిగివున్నారు.
బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలు (రూ.కోట్లలో)