Credit Card Defaults | న్యూఢిల్లీ, ఆగస్టు 8: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లకు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కారద్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. 2022 మార్చి నాటికి రూ.3,122 కోట్లు ఉన్న క్రెడిట్ కార్డ్ స్థూల మొండి బకాయిలు 2023 మార్చికల్లా రూ.4,072 కోట్లకు చేరుకున్నాయని మంత్రి చెప్పారు. ఇదేకాలంలో క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలు రూ.1.64 లక్షల కోట్ల నుంచి రూ. 2.10 లక్షల కోట్లకు పెరగ్గా, మొత్తం రుణంలో స్థూల నిరర్ధక ఆస్తులు 1.91 శాతం నుంచి 1.94 శాతానికి చేరినట్టు వెల్లడించారు. అయితే ఇవి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ల స్థూల ఎన్పీఏల (3.87 శాతం)కంటే క్రెడిట్ కార్డుల మొండి బకాయిలు తక్కువే.
సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి భగవత్ కారద్ సమాధానమిస్తూ 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కో ఆపరేటివ్ బ్యాంక్ల్లో రూ.791 కోట్ల నష్టం చేకూర్చిన 964 మోసాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.1,985 కోట్లకు సంబంధించి 438 ఫ్రాడ్స్ నమోదుకాగా, 2022లో మోసాల సంఖ్య 729కు పెరగ్గా, ఇందులో బ్యాంక్లు రూ.536 కోట్లు నష్టపోయాయి. కో ఆపరేటివ్ బ్యాంక్ల్లో ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ను పటిష్టపరుస్తున్నట్టు ఆర్బీఐ, నాబార్డ్లు ప్రభుత్వానికి తెలిపాయని మంత్రి వివరించారు. సైబర్ సెక్యూరిటీ అడ్వయిజరీలు, పర్యవేక్షణ పెంపు, సిబ్బంది రొటేషన్ తదితర చర్యల్ని బ్యాంక్లు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ, నాబార్డ్లు పేర్కొన్నాయి.