హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ ): కరోనా సంక్షోభంలోనూ అత్యంత స్థిరమైన మార్కెట్లలో హైదరాబాద్ నిర్మాణ రంగం ఒకటిగా నిలిచిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు రామకృష్ణారావు అన్నారు. ప్రభుత్వ విధానాలు, మెరుగైన వసతుల కల్పనతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. గురువారం ఇక్కడ క్రెడాయ్ కార్యాలయంలో 2021-23కుగాను క్రెడాయ్ హైదరాబాద్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 నుంచి రియల్ ఎస్టేట్ రంగం సుస్థిరంగా వృద్ధిని కొనసాగిస్తున్నదన్నారు. ఇందుకు ప్రభుత్వ పాలసీలు, నగరం నలుమూలల ప్రాంతాలు విస్తరించడం, మెరుగైన అభివృద్ధియే కారణమని చెప్పారు. దేశంలో ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరం పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉందన్న ఆయన ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఏవియేషన్ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, వాటితో ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తున్నాయన్నారు. ఐటీ సంస్థలు 30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకొని కార్యకలాపాలు సాగిస్తుండడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ప్రధానంగా పార్కింగ్ సమస్యపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తే తక్షణమే స్పందించి పోడియం పార్కింగ్ పాలసీని తీసుకువచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పాలసీతో వరద ముంపు తగ్గడంతోపాటు నిర్మాణ ఖర్చు తగ్గుతుందన్నారు. ప్లాట్ సైజులను తగ్గించడంవల్ల కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఇదెంతో సౌకర్యవంతమ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అన్ని కొవిడ్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ప్రాపర్టీ షో నిర్వహించబోతున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ శాఖ ప్రకటించింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు జరగనున్న ఈ మెగా షోలో రియల్టర్ల దగ్గర్నుంచి నిర్మాణానికి చెందిన అనేక విభాగాల సంస్థలు, రుణాలిచ్చే ఫైనాన్షియర్లు పాల్గొంటారని రామకృష్ణారావు, రాజశేఖర్రెడ్డి తెలిపారు. కొనుగోలుదారుల సౌకర్యార్థం విశాలమైన ప్రాంగణంలో 100-150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాల బడ్జెట్కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్లు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ నగర పొటెన్షియాలిటీని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారని పేర్కొన్నారు.
క్రెడాయ్ హైదరాబాద్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. 2021-23కుగానూ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. అధ్యక్షుడిగా పీ రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా వీ రాజశేఖరరెడ్డిలు తిరిగి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా జీ ఆనంద్రెడ్డి, కంచం రాజేశ్వర్, ఎన్ జయదీప్రెడ్డి, బీ జగన్నాథరావు, కోశాధికారిగా ఆదిత్య గౌరాను ఎన్నుకున్నారు. ఇక సంయుక్త కార్యదర్శులుగా కే రాంబాబు, శివాజీ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా బీ ప్రదీప్రెడ్డి, సతీష్కుమార్, నితీశ్రెడ్డి, సంజయ్కుమార్ బన్సాల్, ఏ శ్రీనివాస్, కే క్రాంతికిరణ్రెడ్డి, ఎన్ వంశీధర్రెడ్డి, శ్రీరామ్ను ఎన్నుకున్నట్లు రాజశేఖర్రెడ్డి తెలిపారు.
రియల్టీ సుస్థిరతకు సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కారణమని క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి వి రాజశేఖర్రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి మేలు జరిగేలా 20 అంశాలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వాటికి ఆమోదం తెలపడం సంతోషం కలిగించిందన్నారు. ఇక టీఎస్ ఐ పాస్, టీఎస్ బీ పాస్, పర్మిషన్ ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించడం వంటివి రియల్టీకి సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ 40% అమ్మకాలు పెరిగాయన్నారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్న ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కాగా, భూముల ధరలు పెంచుతామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని క్రెడాయ్ స్వాగతిస్తున్నదన్నారు. అయితే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు 3-6 నెలల కనీస సమయాన్ని ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.