FMCG Rates | డిసెంబర్ చిల్లర ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయిందని సాధారణ వినియోగదారుడు కాసింత సంతోషిస్తున్నాడు.. కానీ పలు ఎఫ్ఎంసీజీ సంస్థలు రోజువారీగా వాడే టూత్ పేస్ట్ మొదలు సబ్బు వరకు పలు నిత్యావసర వస్తువుల ధరలు ఈ నెలలో రెండు నుంచి 58 శాతం పెంచేసినట్లు తెలుస్తున్నది. గతేడాది జనవరి తర్వాత వివిధ వంటింటి వినియోగ వస్తువుల ధరలను ఎఫ్ఎంసీజీ సంస్థలు పెంచడం ఇది మూడోసారి. 2022 జనవరిలో ఎఫ్ఎంసీజీ సంస్థలు వివిధ వస్తువుల ధరలు 3-20 శాతం పెంచాయి. ముడి సరుకు ధరలు పెరిగాయంటూ గత మే నెలలో ఎఫ్ఎంసీజీ సంస్థలు పలు వస్తువుల ధరలు పెంచివేశాయి.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), కోల్గేట్, పాల్మోలివ్ బ్రాండ్లు మొదలు.. క్యాడ్బరీ అండ్ ఒరియో, మొండలెజ్ ఇండియా వరకు వివిధ వస్తువుల ధరలు పెంచాయి. ఇన్పుట్ కాస్ట్ను వినియోగదారులపై మోపేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలు 7-9 శాతం పెంచొచ్చునని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ డైరెక్టర్ పుషాన్ శర్మ చెప్పారు.
గ్రామాల్లో డిమాండ్ పెరగడంతో ఆయా ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ లాభాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా ఉత్పత్తుల సేల్స్లో మూడో వంతుకంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతాయి. కొంత కాలం గిరాకీ తక్కువగా ఉండటంతో కంపెనీలు తమ లాభాలు తగ్గించుకున్నాయి. కానీ, ఇప్పుడు పంటల సాగులో లాభాలు, మంచి పంటలకు ప్రభుత్వ ఇన్సెంటివ్లు రావడంతో గ్రామీణుల నుంచి వస్తువులకు గిరాకీ పెరిగింది. దీంతో ఆయా సంస్థలు తమ లాభాలు పెంచుకోవడానికి ఆయా వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెంచాలని యోచిస్తున్నాయి.
డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 12 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. వరుసగా మూడో నెల దిగి వచ్చింది. గత నెల చిల్లర ద్రవ్యోల్బణం 5.72 శాతంగా నమోదైంది. అంతకుముందు నవంబర్ నెలలో 5.88, అక్టోబర్లో 6.77 శాతంగా నమోదైంది. 2021 డిసెంబర్లో చిల్లర ద్రవ్యోల్బణం 5.66 శాతం. గత నెల ద్రవ్యోల్బణం దాదాపు 12 నెలల కనిష్ట స్థాయికి చేరినా, 2021 డిసెంబర్లో కాసింత ఎక్కువ స్థాయిలోనే రికార్డయింది.