Byjus | ఆర్థిక సమస్యలు, వాటాదారుల ఒత్తిళ్లతో సతమతం అవుతున్న ఎడ్ టెక్ స్టార్టప్ ‘బైజూ’స్ మరింత కష్టాల్లో చిక్కుకున్నది. బైజూ’స్ ఆర్థిక లావాదేవీలపై సంస్థ ఖాతాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ (ఎంసీఏ) కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బైజూ’స్ రెండు మూడు నెలల ఓవర్ డ్యూ సమస్యను ఎదుర్కొంటున్నదని ఆ వర్గాల కథనం.
సుపరిపాలన పద్దతులు, నిబంధనల అమలులో వైఫల్యాలపై తనిఖీ చేయాలని ఎంసీఏ అధికారులు కోరినట్లు తెలుస్తున్నది. ఎంసీఏ అధికారుల తనిఖీ నివేదిక ఆధారంగా అవసరమైతే తదుపరి దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైతే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) విచారణేదీ లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత జూలైలోనే ఎస్ఎఫ్ఐఓ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయని వార్తలొచ్చాయి.
బైజూ’స్ ఎడ్ టెక్ స్టార్టప్ నిర్వహిస్తున్న థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలను తనిఖీ చేయాలని హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ను ఎంసీఏ ఆదేశించింది. ఫైనాన్సియల్ రిజల్ట్స్ వెల్లడిలో ఆలస్యం, కంపెనీ అడిటర్గా డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఎంసీఏ అప్పట్లో ఈ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరోసారి బైజూ’స్ ఖాతాల తనిఖీ ప్రక్రియ వేగవంతం చేయాలని, త్వరితగతిన నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎంసీఏ అధికారులు తెలిపారు. కానీ పూర్తి వివరాలను మాత్రం బయట పెట్టలేదు..