న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా మహమ్మారి దెబ్బకు బలహీనపడ్డ దేశ వృద్ధిరేటును బలపరిచేది వ్యాక్సినేషనేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 టీకాల వేగం పెరిగేకొద్దీ ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కూడా పుంజుకుంటుందని చెప్పింది. బుధవారం ఆర్థిక శాఖ తమ నెలసరి ఆర్థిక నివేదికను విడుదల చేసింది. ‘తగ్గుముఖం పట్టే కరోనా కేసులు, వేగవంతమైన వ్యాక్సిన్ ప్రక్రియ, బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక సంస్కరణలే రాబోయే త్రైమాసికాల్లో పెట్టుబడులను ఉత్తేజపరుస్తాయి’ అని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో తిరిగి పట్టాలెక్కగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కాగా, కరోనా వైరస్ ధాటికి జీవితాలు, జీవనోపాధిలు దారుణంగా దెబ్బ తింటున్నాయని, అందుకే మెరుగైన ఆరోగ్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని, ఇందుకోసం ఖర్చుకు వెనుకాడవద్దని అటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు.