న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: దేశంలో కొవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా కరోనా పాలసీలను వచ్చే ఏడాది మార్చిదాకా అమ్ముకోవచ్చని ఇన్సూరెన్స్ సంస్థలకు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సోమవారం అనుమతినిచ్చింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ‘కరోనా కవచ్’, ‘కరోనా రక్షక్’ పేరుతో ఆరోగ్య బీమా పాలసీలను తీసుకురావాలని అన్ని బీమా కంపెనీలను గతేడాది ఐఆర్డీఏఐ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పలు బీమా సంస్థలు వీటిని ప్రారంభించగా, పాలసీదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ స్వల్పకాలిక కొవిడ్ పాలసీల ప్రీమియం.. రెగ్యులర్ ఆరోగ్య బీమా పాలసీలతో పోల్చితే చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా ఈ పాలసీల అమ్మకం, రెన్యువల్స్ను కొనసాగించవచ్చని ఓ సర్క్యులర్లో బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్ పద్ధతిలోనూ..
కరోనా నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాలసీల విక్రయాల గడువునూ ఐఆర్డీఏఐ వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. ఈ మేరకు మరో సర్క్యులర్ను జారీ చేసింది. పాలసీదారుల వద్దకు భౌతిక పత్రాల కోసం వెళ్లే ఏజెంట్లు కరోనా బారిన పడుతుండటంతో బీమా సంస్థలు ఎలక్ట్రానిక్ పాలసీల అమ్మకానికి అనుమతినివ్వాలంటూ ఐఆర్డీఏఐని కోరిన విషయం తెలిసిందే. దీంతో అందుకు అంగీకరించిన రెగ్యులేటర్.. తాజాగా వాటికిచ్చిన గడువును పెంచింది.
కొత్త టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలు
లోపభూయిష్ట టైటిల్ డీడ్ల నుంచి ఆస్తుల కొనుగోలుదారుల రక్షణార్థం కొత్త టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రారంభించాలని జనరల్ ఇన్సూరర్లను ఐఆర్డీఏఐ ఆదేశించింది. సవరించిన ఫార్మాట్ కింద వీటిని తీసుకురావాలని సూచించింది. లోపభూయిష్ట టైటిల్స్తో డెవలపర్లు, కొనుగోలుదారులు నష్టపోతున్న నేపథ్యంలో తగిన సిఫార్సులు చేయాలంటూ ఓ వర్కింగ్ గ్రూప్ను ఐఆర్డీఏఐ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ సూచనల మేరకే తాజా ఆదేశాలను ఐఆర్డీఏఐ ఇచ్చింది.