Business News | న్యూఢిల్లీ, జనవరి 31: దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి. ముడి చమురు, విద్యుత్, ఉక్కు, సిమెంటు రంగాల బలహీనమైన పనితీరుతో ఈ రంగాలు వృద్ధి పడిపోయినట్టు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023 నవంబర్లో మౌలిక రంగాలు (బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్) 7.9 శాతం వృద్ధిచెందగా, 2022 డిసెంబర్లో 8.3 శాతం వృద్ధి సాధించాయి.
2022 అక్టోబర్లో నమోదైన 0.9 శాతం వృద్ధి రేటు తర్వాత కనిష్ఠానికి తగ్గడం 2023 డిసెంబర్లోనే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఈ ఎనిమిది రంగాల వృద్ధి ఫ్లాట్గా 8.1 శాతం వద్ద నమోదయ్యింది. డిసెంబర్ నెలలో బొగ్గు, రిఫైనరీ, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు తగ్గగా, సహజవాయువు ఉత్పత్తి మాత్రం పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఐఐపీ)లో ఈ రంగాల భాగం 40.27 శాతం మేరకు ఉన్నది. మౌలిక రంగాల బలహీన వృద్ధి ఫలితంగా 2023 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 1-3 శాతం మధ్య పరిమితమవుతుందని అంచనా వేస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పారు.