న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు మరింత సులువైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించడానికి తీసుకొచ్చిన నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్తో కేంద్రానికి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఈ పోర్టల్ మొదలైన దగ్గర్నుంచి సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. ట్యాక్స్పేయర్ల నుంచీ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో పోర్టల్ సాఫ్ట్వేర్ను రూపొందించిన ఇన్ఫోసిస్పై మోదీ సర్కార్ ఫైర్ అవుతున్నది. తాజాగా ఈ శని, ఆదివారాల్లోనూ పనిచేయకపోవడంతో కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్తో ఇక్కడి తన కార్యాలయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోర్టల్ సాంకేతిక సామర్థ్యంపై నిర్మల ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టల్ ప్రారంభమై రెండున్నర నెలలు గడిచినా సమస్యలు తొలగకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన మంత్రి.. ఇందుకు గల కారణాలను పరేఖ్ను అడిగి తెలుసుకున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమస్యలపై వివరణను కోరుతూ పరేఖ్కు ఆదివారం ఐటీ శాఖ సమన్లను జారీ చేసిన నేపథ్యంలోనే తాజా భేటీ జరిగింది.
ఇన్ఫీ ఏం చెప్తున్నది?
రెండు రోజులపాటు ఐటీ పోర్టల్ ట్యాక్స్పేయర్లకు అందుబాటులో లేకపోవడంపై ఇన్ఫోసిస్ వర్గాలు అధికారికంగా వివరణ ఇచ్చాయి. ‘ఎమర్జన్సీ మెయింటేనెన్స్’ వల్లే ఈ అంతరాయం చోటుచేసుకున్నదని స్పష్టం చేశాయి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని కూడా తెలియజేసింది. కాగా, సీవోవో ప్రవీణ్ రావు నేతృత్వంలో 750 మందితో కూడిన బృందం ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నదని పరేఖ్.. సీతారామన్కు వివరించారు.
వచ్చేనెల 15 వరకు సంస్థకు గడువు
కొత్త ఐటీ పోర్టల్లో సాంకేతిక సమస్యలపై విసుగెత్తిపోయిన కేంద్రం.. ఇన్ఫోసిస్కు వచ్చేనెల 15దాకా పరిష్కారానికి గడువిచ్చింది. ఈలోగా అన్ని సమస్యలు తీరి పోర్టల్ సజావుగా సాగాలని కంపెనీకి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినట్లు వివరించింది. ఈ మేరకు నిర్మల-పరేఖ్ భేటీ అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఐటీ శాఖ వెల్లడించింది. మరోవైపు పోర్టల్ సాంకేతిక సమస్యలు.. ఐటీ రిటర్నుల గడువు పెంపునకు దారితీయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.