న్యూఢిల్లీ, నవంబర్ 30: కోర్టు ధిక్కరణ కేసులో పరారీ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యకు శిక్ష విధించే అంశమై వచ్చే ఏడాది జనవరి 18న తుది విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించినందుకుగాను 2017లో మాల్యపై నేరం రుజువైంది. ఈ కేసులో ‘చాలాకాలం వేచి చూసాం, ఇక ఎంతమాత్రం వేచి ఉండేది లేదని’ మంగళవారం జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. జనవరి 18న ఆయన కోర్టుకు హాజరైనా, కాకపోయినా శిక్ష విధింపుపై తుది విచారణ జరిపి తీర్పునివ్వనున్నట్లు బెంచ్ తెలిపింది. బ్యాంకుల్ని మోసగించిన కేసు, మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడైన ఈ 65 సంవత్సరాల వాణిజ్యవేత్త 2016 మార్చిలో యూకేకు పరారయ్యాడు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ 2017 మే 9న విజయ్మాల్య తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసారు.