కలిసొచ్చిన ప్రభుత్వ నిర్ణయాలు
రియల్ ఎస్టేట్ రంగం చాలా సున్నితమైనది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రభావం రియల్ రంగంపై ఉంటుంది. ఏడేండ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ అనూహ్య ప్రగతి సాధిస్తుండటం, ప్రభుత్వం ప్రజల కోణంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల రియల్ రంగం పాజిటివ్ వృద్ధిని నమోదు చేస్తున్నది. కొత్త జిల్లాల ఏర్పాటు, పారిశ్రామిక రంగ విస్తరణ, ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు, ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు మెరుగుపరచడం తదితర నిర్ణయాలు రియల్ బూమ్కు దోహదం చేశాయి. ఫలితంగా రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరిగాయి.
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశమే హద్దుగా వృద్ధిపథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రంగానికి కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రస్తుత త్రైమాసికంలో కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ప్రారంభం విషయంలో దక్షిణాదిలో హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఏడేండ్లలోనే రియల్ రంగం స్థూల విలువ జోడింపు (జీవీఏ-గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) ఏకంగా రెట్టింపయ్యింది. ఒక రంగం నుంచి వచ్చే ఉత్పత్తుల విలువను జీవీఏగా లెక్కిస్తారు. రియల్ ఎస్టేట్కు సంబంధించి 2014-15లో జీవీఏ రూ.96 వేల కోట్లు ఉండగా, 2020-21 నాటికి ఏకంగా రూ.1.85 లక్షల కోట్లకు చేరింది. ఏడేండ్లలో దాదాపు రెట్టింపు అయ్యింది. తద్వారా రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదలలో కీలకంగా మారింది. సేవారంగ జీవీఏలో ఏకంగా 35% రియల్ ఎస్టేట్
రంగానిదే కావడం విశేషం. 2020-21లో సేవారంగం జీవీఏ రూ.5.33 లక్షల కోట్లుగా అంచనా వేశారు.ఏటా రూ.15-20 వేల కోట్లు పెరుగుదల రియల్ ఎస్టేట్ రంగ జీవీఏ ఏటా కనీసం రూ.15-20 వేల కోట్ల వృద్ధి నమోదు చేస్తున్నది. ఇందులో హైదరాబాద్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. గతేడాది లాక్డౌన్ సమయంలో ఇతర లావాదేవీలు నిలిచిపోయినా, నిర్మాణ రంగంపై పెద్దగా ప్రభావం చూపలేదని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని ప్రశంసిస్తున్నారు. ఇతర రాష్ర్టాల కార్మికులకు భరోసా కల్పించి, అత్యధికులు ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవడంతో నిర్మాణ రంగంలో పెద్దగా ఒడిదుడుకులు ఎదురు కాలేదు. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో నిర్మాణాలు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, టీకాలు వేయడం వంటి చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. కరోనాతో ఆతిథ్యరంగం కాస్త దెబ్బతిన్నా, వెంటనే కోలుకున్నది. ఈ ఏడాది చివరి నాటికి ఈ రంగం సాధారణ స్థితికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
కొత్త నిర్మాణాల్లో కింగ్ ప్రాప్ టైగర్ రిసెర్చ్ నివేదికలో వెల్లడి
రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో హైదరాబాద్ నగరం దక్షిణాది మెట్రో నగరాలన్నింటికంటే ముందు వరుసలో నిలిచింది. కొత్త ప్రాజెక్టుల విషయంలో 2021 మూడో త్రైమాసికంలో హైదరాబాద్ నగరం ఏకంగా మూడంకెల వృద్ధిని నమోదు చేసిందని ప్రాప్ టైగర్ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య నగరంలో 12,342 కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైనట్టు పేర్కొంది. ఈ అంశంలో ఏకంగా 189 శాతం వృద్ధిని నమోదు చేసింది. నగరంలోని దుండిగల్, తెల్లాపూర్, గచ్చిబౌలి, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో త్రీ బీహెచ్కే నిర్మాణాలు 52 శాతం మేర పెరగ్గా, రెండు బెడ్రూం నిర్మాణాలు 43 శాతం మేర పెరిగాయి. ఇండిపెండెంట్ గృహాల అమ్మకాలు 140 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రూ.1-3 కోట్ల విలువైన ఫ్లాట్ల అమ్మకాల్లో పెరుగుదల 36 శాతం ఉండగా, రూ.45-75 లక్షల విలువైన నివాస గృహాల అమ్మకాల్లో వృద్ధి 34 శాతంగా ఉన్నదని నివేదిక వెల్లడించింది.