Nirmala Sita Raman | దేశ ఆర్థిక అభివృద్ధికి బయటి నుంచి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలే ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. క్రూడాయిల్ ధరలు అధికంగా ఉండటంతోపాటు ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి వంటి ఘటనలతో దేశ ఆర్థిక వృద్ధిరేటుపై ప్రభావం పడొచ్చునన్నారు. ముడి చమురు ఉత్పత్తి తగ్గించాలని ఇటీవల ఒపెక్ ప్లస్ కూటమి తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరుగవచ్చునని ఆమె తెలిపారు.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీరేట్లు పెంచాలన్న అంశంపై ఇక నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వును అనుసరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ద్రవ్య పరపతి సమీక్ష కఠినతరం చేసే ప్రక్రియకు విరామం ఇవ్వడం వల్ల కొన్ని దేశాలు వృద్ధి దిశగా అడుగులేస్తున్నాయని అన్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు, స్థానిక పరిస్థితులు, సమస్యలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం అమెరికాలో నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అమెరికాతోపాటు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం తలెత్తితే.. దాని ప్రభావం కూడా మన దేశ ఆర్థిక పురోగతిపై ఉంటుందని చెప్పారు. విదేశాలకు ఎగుమతులు తగ్గుతాయని, తయారీ రంగం మందగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ విధాన పరమైన సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇప్పటికైతే స్థిరంగా కొనసాగుతున్నదన్నారు.