న్యూఢిల్లీ, మార్చి 11: ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ‘కాంప్లియెన్స్ పోర్టల్’ పలువురి పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని తప్పుగా చూపిస్తున్నదంటూ సోషల్ మీడియాలోనూ, చార్టర్డ్ అకౌంటెంట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లావాదేవీల విలువను, చెల్లించాల్సిన అడ్వాన్సు ట్యాక్స్ విలువను పోర్టల్ ఎక్కువచేసి చూపుతున్నదని చార్టర్డ్ అకౌంటెంట్లు ఆరోపిస్తున్నారు.
కొంతమంది ట్యాక్స్పేయర్ల యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్)లో లావాదేవీ రూ.450 ఉంటే అది రూ.45,000గా కన్పిస్తున్నదన్నారు. ఒక ట్యాక్స్పేయర్ రూ. 4 లక్షలకు విక్రయిస్తే, దానిని రూ. 17 కోట్లకు పోర్టల్ పెంచివేసిందంటూ ఎక్స్ పోస్టుల్లో వివరించారు. ట్యాక్స్పేయర్ల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అందించడంలో కాంప్లియెన్స్ పోర్టల్ ఉపయోగపడుతున్నప్పటికీ, కొన్ని పొరపాట్లను సరిచేయాల్సి ఉందని చార్టర్డ్ అకౌంటెంట్లు అన్నారు.
ఐటీ శాఖ వివరణ
ఈ ఫిర్యాదులపై ఆదాయపు పన్ను శాఖ సోమవారం ఎక్స్ పోస్టులో స్పందిస్తూ ‘ట్యాక్స్పేయర్ల నుంచి అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని అసమానతలు గుర్తించాం. ఒక రిపోర్టింగ్ ఎంటిటీ అందించిన సెక్యూరిటీస్ మార్కెట్ డాటాలో ఈ అవకతవకలు ఉన్నాయి. అప్డేట్ అయిన సమాచారంతో సవరించిన మరో స్టేట్మెంట్ను ఇవ్వమంటూ ఆ సంస్థను కోరాం. ఈ మేరకు ఏఐఎస్లో అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్స్ కోసం వేచిచూడమని పన్ను చెల్లింపుదార్లకు సూచిస్తున్నాం’ అని వివరించింది. ఒక అసెస్సీ రూ.4 లక్షల విలువైన తన మ్యూచువల్ ఫండ్స్, షేర్లను విక్రయిస్తే, పోర్టల్ దానిని రూ. 17 కోట్లుగా చూపించిందని ట్యాక్స్మాన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా చెప్పారు.